రామాయ‌ణంలో వాళ్లిద్దరూ ఎక్క‌డ‌?

చాన్నాళ్ల నుంచి భార‌తీయ ప్రేక్ష‌కులు ఎదురు చూస్తున్న ప్రోమో రానే వ‌చ్చింది. ఇండియాస్ బిగ్గెస్ట్ ఎపిక్స్‌లో ఒక‌టైన రామాయ‌ణం ఆధారంగా రూపొందిన రామాయ‌ణ సినిమా నుంచి థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌ను గురువారం తెల్ల‌వారుజామున బ్ర‌హ్మ ముహూర్తంలో ట్రైల‌ర్‌ను లాంచ్ చేసింది టీమ్‌. ఈ ట్రైల‌ర్‌కు కొంత మిశ్ర‌మ స్పంద‌న ఉన్న‌ప్ప‌టికీ.. ఓవ‌రాల్‌గా పర్లేదనే ఫీడ్ బ్యాకే వ‌చ్చింది. చివ‌ర‌గా రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కి, ట్రోల్ మెటీరియ‌ల్‌గా మారిన ఆదిపురుష్‌తో ఈ చిత్రాన్ని పోల్చడం గమనార్హం.

అదే స‌మ‌యంలో రావ‌ణుడి పాత్రను అతిగా చూపించార‌ని, సీత పాత్ర‌కు సాయిప‌ల్ల‌వి అనుకున్నంత బాగా సూట్ కాలేద‌ని, ఎఫెక్ట్స్ విష‌యంలో ఏఐ వాడ‌కం ఎక్కువైంద‌ని.. ఇలాంటి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండ‌గా.. ట్రైల‌ర్లో ఇద్ద‌రు ముఖ్యమైన ఆర్టిస్టులు క‌నిపించ‌క‌పోవ‌డం మీద చ‌ర్చ జ‌రుగుతోంది. ఆ ఇద్ద‌రే.. స‌న్నీ డియోల్, కాజ‌ల్ అగ‌ర్వాల్.

గ‌ద‌ర్‌-2 చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో బంప‌ర్ క్రేజ్ తెచ్చుకున్న స‌న్నీ డియోల్.. రామాయ‌ణ‌లో అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన హ‌నుమంతుడి పాత్ర‌ను చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రామాయ‌ణం మీద ఎప్పుడు ఎవ‌రు సినిమా తీసినా.. ఆ పాత్ర మీద స్పెష‌ల్ ఫోక‌స్ పెడ‌తారు. ఆ క‌థ‌కు ఎంతో ఆక‌ర్ష‌ణ తీసుకొచ్చే పాత్ర ఇది.

కానీ రామాయ‌ణ ట్రైల‌ర్లో ఎక్క‌డా హ‌నుమంతుడి పాత్ర క‌నిపించ‌లేదు. దీంతో స‌న్నీ డియోల్ అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గుర‌య్యారు. ఐతే రామాయ‌ణంలో యుద్ధ ఘ‌ట్టం మొత్తం రెండో పార్ట్‌లో ఉంటుంద‌ని.. హ‌నుమంతుడి పాత్ర కూడా అందులోనే రంగ‌ప్ర‌వేశం చేస్తుంద‌ని తెలుస్తోంది. బ‌హుశా పార్ట్‌-1లో చివ‌ర్లో హ‌నుమంతుడి పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తారేమో. 

మ‌రోవైపు రావ‌ణుడి భార్య‌ మండోద‌రి పాత్ర‌లో కాజ‌ల్ క‌నిపించ‌నుండ‌గా.. ఆమెను ట్రైల‌ర్లో చూపించ‌లేదు. ఈ సినిమాలో త‌న‌ది చిన్న పాత్రే అని కాజ‌ల్ ఇంత‌కుముందే క్లారిటీ ఇచ్చింది. ఎంత ప్రాధాన్యం త‌క్కువున్న పాత్ర అయినా స‌రే.. ట్రైల‌ర్లో చిన్న షాట్ కూడా పెట్ట‌క‌పోవ‌డంతో కాజ‌ల్ ఫ్యాన్స్ కూడా డిజ‌ప్పాయింట్ అవుతున్నారు.