నా విడాకులకు కారణం ప్రీతి జింతానే

బాలీవుడ్లో ఒకప్పుడు పేరున్న గాయనీమణుల్లో సుచిత్రా కృష్ణమూర్తి. నటి, ఆర్టిస్టు కూడా అయిన సుచిత్ర.. దక్షిణాది చిత్రాల్లోనూ అనేక పాటలు పాడింది. ఆమె లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్‌‌ను పెళ్లాడి ఒక బిడ్డను కూడా కన్నాక కొన్నేళ్లకు విడాకులు తీసుకుంది. పెళ్లయిన ఎనిమిదేళ్లకే వీరు విడిపోయారు. తమ విడాకులకు కారణం ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతి జింతానే అంటూ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మీద విరుచుకుపడింది.

ప్రీతి తన కాపురంలో నిప్పులు పోసిందని ఆమె ఆరోపించింది. గతంలోనూ ప్రీతి మీద విమర్శలు చేయగా.. ఆమె వాటిని తిప్పి కొట్టింది. ఇప్పుడు మరోసారి ఓ ఇంటర్వ్యూలో ప్రీతి మీద విమర్శలు గుప్పించింది సుచిత్రా కృష్ణమూర్తి. ‘‘శేఖర్ నాకంటే 30 ఏళ్లు పెద్దవాడైనప్పటికీ తనను పెళ్లాడాను. మా ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకోకపోయినా నేను ముందడుగు వేశాను. మాకు ఒక కూతురు కూడా పుట్టింది.

కానీ తర్వాత మా సంసారంలో కలతలు వచ్చాయి. మా విడాకులకు ప్రీతి జింతానే కారణం. ఆమెను నేను ఎప్పటికీ క్షమించను’’ అని సుచిత్రా కృష్ణమూర్తి తెలిపింది. మరి ఈ ఆరోపణలను ప్రీతి తిప్పికొట్టడం గురించి ప్రస్తావించగా.. ‘‘ఆమె మాటలను పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. ఎవరేం మాట్లాడినా సత్యానికే బలం ఉంటుంది. నేను ఒక గృహిణిగా.. 20 ఏళ్లుగా తల్లిగా ఉంటున్నందుకు గర్విస్తున్నా. ఆమెను మాత్రం ఎప్పటికీ క్షమించను. అలాగే తన గురించి పట్టించుకోను’’ అని సుచిత్రా పేర్కొంది.