3 రోజుల్లో 300 కోట్లు సంతోషమే కానీ

మొదటి వీకెండ్ ని ఆదిపురుష్ పూర్తిగా తన కంట్రోల్ లోకి తీసుకుంది. ఒకవైపు సోషల్ మీడియా ట్రోలింగ్ జరుగుతున్నా, వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఎదురుకోవడానికి దర్శక రచయతలు నానా తంటాలు పడుతున్నా, ఓసారి చూసే తీరాలని డిసైడ్ అయిన ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లిపోతున్నారు. అయితే శుక్రవారానికి ముందే మూడు రోజులకు సరిపడా అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా జరగడం ఆదిపురుష్ కు ప్రధానంగా కలిసి వచ్చిన అంశం. మంచి స్క్రీన్లలో లేట్ అయితే టికెట్లు దొరకవనే ఉద్దేశంతో ముందస్తుగా కొన్న ఆడియన్స్ తో పాటు కరెంట్ బుకింగ్స్ భారీగా జరిగాయి.

ట్రేడ్ నుంచి అందుకున్న లెక్కలను బట్టి చూస్తే కేవలం 3 రోజుల్లో 300 కోట్ల గ్రాస్ ని దాటేయడం పెద్ద రికార్డే. అది కూడా ఇంత ప్రతికూలమైన వాతావరణంలో. వీకెండ్ విషయంలో ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్ 2, బాహుబలి 2ని దాటలేకపోయినా కేవలం పది కోట్ల తేడాతో పఠాన్ ని దాటే అవకాశాన్ని పోగొట్టుకుంది. ఒకవేళ యునానిమస్ టాక్ వచ్చి ఉంటే ఏమయ్యేదో కానీ ఒకరకంగా దర్శకుడు ఓం రౌత్ మంచి ఛాన్స్ ని చేతులా వృధా చేసుకున్నాడు. షేర్ రూపంలో చూసుకుంటే నైజామ్ 29 కోట్ల 60 లక్షలు, సీడెడ్ 7 కోట్ల 50 లక్షలు, ఉత్తరాంధ్ర 8 కోట్ల 25 లక్షల దాకా రాబట్టిందట.

మొత్తం ఏపీ తెలంగాణ కలిపి 65 కోట్లకు దగ్గరగా షేర్ రాగా మిగిలిన వరల్డ్ వైడ్ తో జత కూడితే `151 కోట్ల షేర్ వచ్చేసినట్టే. బ్రేక్ ఈవెన్ గా టార్గెట్ పెట్టుకున్న 240 కోట్లను చేరాలంటే ఇంకో 90 కోట్ల దాకా రావాలి. ఇవాళ్టి నుంచి డ్రాప్ ఉన్నప్పటికీ అది ఎంత శాతంలో ఉంటుందనే దాన్ని బట్టి ఏరియాల వారిగా లాభముంటుందా నష్టం వస్తుందా అనేది తేలుతుంది. తమిళనాడు, కేరళలో బాగా వీక్ గా ఉండటం ఆదిపురుష్ కు ప్రతికూలంగా మారింది. అక్కడ సపోర్ట్ దక్కి ఉంటే రేంజ్ ఇంకోలా ఉండేది. అసలైన అగ్నిపరీక్ష ఈ రోజు నుంచి మొదలుకాబట్టి ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి