త్రిష మహర్జాతకం మళ్ళీ షురూ

హీరోయిన్ గా కెరీర్ మొదలుపెట్టి పంతొమ్మిదేళ్లు గడిచాక ఎవరైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోతారు . మహా అయితే వదిన లేక అక్క పాత్రలు వస్తాయి తప్పించి కోట్ల రెమ్యునరేషన్లు ఇచ్చే ప్రాజెక్టులు దరిదాపుల్లో కూడా ఉండవు . కానీ త్రిష మాత్రం నాకిది వర్తించదు అంటోంది. ముఖ్యంగా పొన్నియిన్ సెల్వన్ 2 లో తనను చూశాక అరె ఇంత కాలం ఈమెను ఎందుకు నిర్లక్ష్యం చేశామని దర్శకులు ఫీలవుతున్నారు. విజయ్ సేతుపతి 96 ఎంత బ్లాక్ బస్టరైనా అది పూర్తిగా ఫీల్ గుడ్ మూవీ కావడంతో త్రిషని గ్లామర్ రోల్స్ కి తీసుకోవాలా వద్దానే సంశయం మేకర్స్ లో ఉండేది.

ఇప్పుడది పూర్తిగా తొలగిపోయింది. ప్రస్తుతం విజయ్ లియోలో నటిస్తున్న త్రిషకు మరో రెండు క్రేజీ ఆఫర్లు తలుపు తట్టాయి. అందులో మొదటిది తల అజిత్ సరసన కథానాయికగా నటించే ఛాన్స్. మాగిజ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందబోయే ఈ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీకి అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలుకాలేదు. రెండు మూడు ఆప్షన్లు చూశాక ఫైనల్ గా త్రిషకే ఓటేశారట. ధనుష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయబోయే 50వ సినిమాలోనూ త్రిష లాక్ అయ్యిందట. వీళ్ళతో గతంలోనే జోడి కట్టిన ట్రాక్ రికార్డు త్రిషది

నాలుగు పదుల వయసుకు అతి దగ్గరగా ఉంటూ త్రిష ఇలాంటి అవకాశాలు పట్టేయడం గొప్పే. టాలీవుడ్ కోలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడిన ఈ కుందవైకి బ్యాలన్స్ ఎవరూ లేరు. ఇప్పుడు మణిరత్నం పీఎస్ పుణ్యమాని మళ్ళీ బిజీ అయిపోతోంది. పారితోషికం కూడా భారీగా ముట్టజెబుతున్నారట. ప్రభాస్ వర్షం వచ్చినప్పుడు టీనేజ్ లో ఉన్న యువకులందరూ ప్రస్తుతం ఉద్యోగాలు చేసుకుంటూ మధ్యవయసు దాటిపోతే త్రిష మాత్రం ఇంకా అలాగే స్క్రీన్ మీద మెరవడం వింతే. టాలీవుడ్ రీ ఎంట్రీ కోసం త్రిష ఎదురు చూస్తోందట. ఎవరు ఆఫర్ చేస్తారో.