భాగ్యశ్రీ ని బ్లాక్ చేసిన తల్లి

సినిమాల పట్ల ముందుతరం తల్లిదండ్రుల్లో చాలా వరకు ప్రతికూల అభిప్రాయమే ఉంటుంది. తమ పిల్లల్లో ఎవరైనా సినిమాల్లోకి వెళ్తామంటే.. కంగారు పడేవాళ్లే ఎక్కువ. అక్కడ స్థిరమైన కెరీర్ ఉండదనే భయానికి తోడు.. ఆ ఇండస్ట్రీ గురించి ఉండే చెడు అభిప్రాయం తమ పిల్లల్ని సినిమాల వైపు వెళ్లనివ్వదు.

ముఖ్యంగా అమ్మాయిలను ఇండస్ట్రీలోకి పంపించడానికి మరింతగా భయపడతారన్నది వాస్తవం. ఇప్పుడు టాలీవుడ్లో అగ్ర కథానాయికగా ఎదుగుతున్న భాగ్యశ్రీ బోర్సేకు సినిమాల్లోకి వెళ్తానంటే.. కుటుంబ సభ్యుల నుంచి సహకారం అందలేదట. స్వయంగా ఆమె తల్లి తనను వాట్సాప్‌లో బ్లాక్ చేసిందట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది భాగ్యశ్రీ.

తాను సినిమాల్లోకి వెళ్తానని ముందుగా తన తల్లికి చెప్పానని, కానీ ఆమె వెంటనే వద్దని చెప్పిందని భాగ్యశ్రీ తెలిపింది. తర్వాత తండ్రికి ఫోన్ చేస్తే.. అమ్మ వద్దన్న పని ఎలా చేస్తావని ప్రశ్నించినట్లు చెప్పింది. కనీసం తన అక్క అయినా తనను సపోర్ట్ చేస్తుందేమో అని ఆమెకు కాల్ చేశానని.. కానీ ఆమె కూడా తల్లిదండ్రులు వద్దంటున్నారు కదా అని తనకు మద్దతుగా నిలబడలేదని భాగ్యశ్రీ వాపోయింది.

ఇలా అందరూ నో చెప్పినా.. తాను మాత్రం ప్రయత్నాలు ఆపలేదని, సినిమాల మీద ఉన్న ఆసక్తితో ఆడిషన్లు ఇచ్చానని భాగ్యశ్రీ తెలిపింది. దీంతో ఇంట్లో వాళ్లు తనను శత్రువులా చూడడం మొదలుపెట్టారని.. తన తల్లి వాట్సాప్‌లో తనను బ్లాక్ చేసిందని, ఆరు నెలల పాటు తనతో మాట్లాడలేదని వెల్లడించింది.

ఇప్పుడు తాను నవ్వుతూ ఈ విషయం చెప్పా కానీ.. ఆ సమయంలో తల్లి అలా చేయడం చాలా బాధ పెట్టిందని భాగ్యశ్రీ పేర్కొంది. ఫిలిం ఇండస్ట్రీ అనగానే తల్లిదండ్రులకు కొన్ని భయాలుంటాయని.. కానీ జీవితంలో ఎలాంటి రిగ్రెట్ ఉండకూడదంటే కెరీర్ విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే అని, మనపై మనకు నమ్మకం ఉండడం చాలా ముఖ్యమని ఆమె వ్యాఖ్యానించింది. ‘మిస్టర్ బచ్చన్’తో మొదలుపెట్టి వరుసగా నాలుగు ఫ్లాపులు ఇచ్చిన భాగ్యశ్రీ.. ఇటీవలే ‘లెనిన్’ మూవీతో మంచి హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.