అంజి చేసిన తప్పు రిపీట్ కాకూడదు  

విజువల్ ఎఫెక్ట్స్ తో ముడిపడిన సినిమాలకు ఎక్కువ సమయం పడుతుంది. ఇది వాస్తవం. పైగా ఇప్పుడు ఏఐ వచ్చాక జనాలు బాగా పరిణితి చెందారు. విజువల్స్ ఏ మాత్రం తేడాగా అనిపించినా నిర్మొహమాటంగా నెగటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారు. దెబ్బకు దర్శక నిర్మాతలు ఆఘమేఘాల మీద రిపేర్లు చేయాల్సి వస్తోంది. నాలుగు వేల కోట్లతో తీసినట్టు చెప్పుకుంటున్న రామాయణకు సైతం ఈ తిప్పలు తప్పలేదు. ఇక్కడ చెప్పబోయే టాపిక్ గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నదే, అవసరమైనదే.

రెండు సంవత్సరాలు దాటుతున్నా విశ్వంభర నుంచి సరైన అప్డేట్ రాకపోవడం మెగా ఫ్యాన్స్ అనుమానాలను మరింత పెంచుతోంది. గతంలో అంజి ఆరు సంవత్సరాల నిర్మాణం జరుపుకుంది. ముందు సభాపతిని దర్శకుడిగా తీసుకుని, ఆయన తీసిన ఫుటేజ్ బాగాలేదని కోడి రామకృష్ణ గారిని తీసుకొచ్చి మిగిలిన భాగం పూర్తి చేయించి, గ్రాఫిక్స్ కోసం విదేశాలకు వెళ్లి నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తీవ్ర వ్యయ ప్రయాసలు పడ్డారు. ఇంతా చేసి అంజి బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచింది.

విపరీతమైన ఆలస్యం వల్ల అంచనాలు ప్రభావితం చెందటం, ఆడియో అనుకున్న స్థాయిలో లేకపోవడం, వర్షం లాంటి బలమైన కాంపిటీషన్ ముందు నిలవలేకపోవడం లాంటి కారణాలు అంజిని దెబ్బ కొట్టాయి. క్లైమాక్స్, కొన్ని ఎపిసోడ్స్ ఇప్పటికీ బెస్ట్ అనిపిస్తాయి కానీ ఓవరాల్ గా చూసుకుంటే కంటెంట్ నిరాశపరిచేదే. ఇప్పుడు విశ్వంభర అదే దారిలో వెళ్లకూడదని అభిమానులు నిత్యం కోరుకుంటున్నారు. ఏదో ఒక రూపంలో అప్డేట్స్ ఇవ్వమని కోరుతున్నారు.

ప్రస్తుతం కొరియన్ కనకరాజు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న యూవీ క్రియేషన్స్ యూనిట్ తర్వాతైనా విశ్వంభర ప్రమోషన్ మొదలు పెడుతుందా అంటే సమాధానం దొరకడం కష్టం. ఎందుకంటే ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజుకి మెగా 158 టీజర్ రెడీ అవుతోంది. ఒకవేళ దానికి బదులు విశ్వంభర ట్రయిలర్ వచ్చి ఉంటే మూవీ త్వరలో రిలీజనే నమ్మకం కలిగేది. అక్టోబర్ లో సినిమా విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినిపిస్తోంది కానీ ఖరారుగా అయితే చెప్పలేం.