తమన్నా గురించి ఉత్తుత్తి ప్రచారం

ఏదైనా పుకారు రావడం ఆలస్యం దానికి రెక్కలు తొడిగి అంతరిక్షంలో పంపేందుకు సోషల్ మీడియా కాచుకుని ఉంటుంది. అందులోనూ సినిమాలకు సంబంధించివి అయితే సెకండ్లలో వెళ్లిపోతాయి. బాలకృష్ణ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ చిత్రంలో తమన్నా ఒక ప్రత్యేక క్యామియో లేదా ఐటెం సాంగ్ చేయబోతోందని దానికి గాను భారీ పారితోషికం ఇచ్చేందుకు నిర్మాతలు ఒప్పుకున్నారని జోరుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్ షూటింగ్ లో బిజీగా ఉన్న మిల్కీ బ్యూటీ దాకా ఈ న్యూస్ చేరిపోయాయి.

వెంటనే ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేసింది. బాలయ్య అనిల్ మీద తనకు అపారమైన గౌరవం ఉందని అదే సమయంలో గాలి మాటలకు ప్రాధాన్యం ఇస్తూ కొన్ని వర్గాలు దాన్ని స్ప్రెడ్ చేయడం బాధ కలిగించిందని చెప్పుకుంది. ఎఫ్2, ఎఫ్3 లకు రావిపూడితో పని చేసిన తమన్నా నిజంగా టీమ్ అడిగితే నో చెప్పకుండా ఉండదు. ఎందుకంటే సరిలేరు నీకెవ్వరూ, జై లవకుశ లాంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ గతంలోనే చేసింది. కానీ అసలు అలాంటి ప్రతిపాదన లేకుండా ఇలా గాసిప్ పుట్టించడం వల్ల అసలు సమస్య వచ్చింది.

ఇక ఎన్బికె 108 విషయానికి వస్తే ఇటీవలే కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. ట్రక్ డ్రైవర్ గా బాలయ్య మాస్ అవతారంలో కనిపించబోతున్నాడు. క్రేజీ ఫైట్ సీక్వెన్స్ కూడా పూర్తయ్యింది. అక్టోబర్ విజయదశమి విడుదలను టార్గెట్ చేసుకున్న ఈ సినిమా కోసం స్వర్గీయ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ టైటిల్ వాడబోతున్నారని ఇన్ సైడ్ టాక్. దానికి సంబంధించిన క్లూ ఇంకా రాలేదు కానీ క్రేజీగా ఉంటుందనైతే వినిపిస్తోంది.ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా శ్రీలీల చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత తమన్ నుంచి హ్యాట్రిక్ ఆశిస్తున్నారు ఫ్యాన్స్