పాము భయంతో రెండు బ్లాక్‌బస్టర్లు మిస్

కొందరికి పాము అనే మాట ఎత్తితేనే చాలు ఒళ్లు జలదరిస్తుంది. పాము ఫొటోలు, వీడియోలు చూసినా కూడా తట్టుకోలేరు. అలాంటిది ఒరిజినల్ పామును చూడాలంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ఈ భయంతోనే ఒక హీరో రెండు బ్లాక్ బస్టర్ సినిమాలకు దూరం అయ్యాడు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ హీరో మరెవరో కాదు.. అల్లరి నరేష్. ఒకప్పుడు కామెడీ సినిమాలతో అలరించిన నరేష్.. ఇప్పుడు సీరియస్ సినిమాలతో మెప్పించే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే మహర్షి, నాంది లాంటి సినిమాలు చేయకముందే అతను ఒక సీరియస్ థ్రిల్లర్ మూవీలో నటించాల్సిందట. అదే.. కార్తికేయ. ఈ కథను ముందు దర్శకుడు చందూ మొండేటి నరేష్‌కే చెప్పాడట. తనకు కూడా కథ బాగా నచ్చిందట. కానీ సినిమాలో పాము ప్రధాన పాత్రధారి అని.. పాముతో షూట్ చేయాల్సి ఉంటుందని చెప్పడంతో ఈ చిత్రానికి నో చెప్పాడట.

‘‘వ్యక్తిగతంగా నాకు పాపులంటే విపరీతమైన భయం. బయటే కాదు.. సినిమాల్లో కనిపించే పాము దృశ్యాలను చూసినా ఇప్పటికీ భయపడతాను. కార్తికేయ కథ నచ్చినా సరే.. ఈ భయంతోనే నేను ఆ సినిమాను తిరస్కరించాను’’ అని నరేష్ తెలిపాడు. నరేష్ కాదన్నాక నిఖిల్‌కు చందూ ఈ స్టోరీ చెప్పడం.. అతను నచ్చి సినిమా చేయడం జరిగాయి.

‘కార్తికేయ’ అప్పట్లోనే రూ.6 కోట్ల బడ్జెట్లో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర రూ.20 కోట్లకు పైగా షేర్ రాబట్టి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తర్వాత ఈ కథకు కొనసాగింపుగా నిఖిల్‌నే పెట్టి ‘కార్తికేయ-2’ తీస్తే అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపి నిఖిల్‌కు మంచి ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది. నరేష్‌ను హీరోగా పెట్టినా ‘కార్తికేయ’ మంచి ఫలితాన్నే అందుకునేది అనడంలో సందేహం లేదు. అలాగే సీక్వెల్ కూడా తెరకెక్కి అతడి కెరీర్ మరో స్థాయికి వెళ్లేదేమో. మొత్తానికి పాము భయంతో నరేష్ రెండు బాక్ బస్టర్లు మిస్సయ్యాడని అనుకోవాలన్నమాట.