‘బ్యాచిలర్’ను పట్టించుకున్నారు.. చాలు చాలు

తొలి సినిమాతో గ్రాండ్ లాంచింగ్ ప్లాన్ చేశారు. వర్కవుట్ కాలేదు. రెండోసారి ఎంతో జాగ్రత్తగా సినిమాను ఎంచుకుని రీలాంచ్ అన్నారు. ఫలితం లేకపోయింది. ఇక మూడోసారి రీరీలాంచ్ జరిగింది. అయినా లాభం లేకపోయింది. ఇదీ అక్కినేని అఖిల్ పరిస్థితి. లాంచింగ్‌కు ముందు అతడి మీద ఎన్నో అంచనాలుండేవి. అతడి చుట్టూ భారీ హైప్ కనిపించేది. కానీ నెమ్మదిగా అవన్నీ పక్కకు వెళ్లిపోయాయి.

ఇప్పుడు క్రేజ్, హైప్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంగతి తర్వాత.. ముందు ఒక సక్సెస్ వస్తే చాలన్నట్లుంది పరిస్థితి. అఖిల్ ఆశలన్నీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మీదే ఉన్నాయి. ఇంతకుముందు నాగచైతన్యకు ‘100 పర్సంట్ లవ్’ రూపంలో పెద్ద హిట్టిచ్చినట్లే అల్లు అరవింద్.. అఖిల్‌కు కూడా విజయాన్నిస్తాడని నాగార్జున ఆశిస్తున్నాడు. ఐతే ఫెయిల్యూర్లలో కొట్టుమిట్టాడుతున్న బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం, అఖిల్ ఫ్యాక్టర్ నెగెటివ్ అవుతున్నాయి.

సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మొన్నటి దాకా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ మీద అంచనాలు పెద్దగా లేవు. సినిమా నుంచి ఏవైనా విశేషాలు రిలీజ్ చేసినపుడు పెద్దగా స్పందన కనిపించలేదు. పూజా హెగ్డే లాంటి క్రేజీ హీరోయిన్ ఇందులో నటించినప్పటికీ ఫలితం లేదే అని చిత్ర బృందం కలవర పడుతూ వచ్చింది. ఐతే ఈ సినిమా గురించి అందరూ మరిచిపోయిన సమయంలో తాజాగా క్వారంటైన్ పోస్టర్ అంటూ ఒకటి వదిలారు.

అందులో షార్ట్ వేసుకున్న పూజా.. అఖిల్ భుజంపై కాలు పెట్టి అతడిని కవ్వించే ప్రయత్నం చేస్తోంది. ఏ ముహూర్తాన ఈ పోస్టర్ వదిలారో కానీ.. దీని గురించి పెద్ద చర్చే నడిచింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో పూజా కాళ్ల మీదే ‘సామజ వరగమన’ పాట నడుస్తుందన్న సంగతి తెలిసిందే. తాజా పోస్టర్‌కు దాన్ని ముడిపెడుతూ రకరకాల వ్యాఖ్యలు, మీమ్స్ హల్‌చల్ చేశాయి. అలాగే ఇంతకుముందు ‘1 నేనొక్కడినే’ పోస్టర్ మీద విమర్శలు చేసిన సమంత ఇప్పుడెక్కడ పోయిందంటూ ఆమెను టార్గెట్ చేశారు కొందరు.

ఎలాగైతేనేం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ గురించి సోషల్ మీడియాలో రెండు రోజులుగా చర్చ నడుస్తోంది. ఇలాగైనా అఖిల్ సినిమాను పట్టించుకున్నందుకు అక్కినేని ఫ్యాన్స్, చిత్ర బృందం హ్యాపీనే.