ఆగస్ట్ 11 కోసం నువ్వా నేనా పోటీ

ఇంకా ఆరు నెలల సమయం ఉన్నప్పటికీ ఆగస్ట్ లో వచ్చే స్వాతంత్ర దినోత్సవాన్ని టార్గెట్ చేసుకున్న సినిమాలు ఎట్టి పరిస్థితుల్లో ఆ డేట్ కి విడుదల చేసుకునేలా పావులు కదుపుతున్నాయి. మహేష్ బాబు 28 ఆగస్ట్ 11నే వస్తుందని ఆ మధ్య నిర్మాత నాగ వంశీ చెప్పిన కొద్దిరోజులకే చిరంజీవి భోళాశంకర్ వేసవి నుంచి తప్పుకుని అదే డేట్ ని లక్ష్యంగా పెట్టుకుందనే ప్రచారం జరిగింది. వీళ్లిద్దరే అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కథ ఇక్కడితో అయిపోలేదు. రవితేజ టైగర్ నాగేశ్వరరావును అదే వారం దించితే ఎలా ఉంటుందనే ఆలోచనలో నిర్మాణ బృందం సీరియస్ గా ఉందట

ఒకవేళ మహేష్ ది తప్పుకోవాల్సి వస్తే అదే నిర్మాణ సంస్థలో రూపొందుతున్న టిల్లు స్క్వేర్ ని బ్యాకప్ లో రెడీగా ఉంచేలా సితార టీమ్ స్కెచ్ వేసిందట. బాలీవుడ్ లోనూ వ్యవహారం ఆషామాషీగా లేదు. రన్బీర్ కపూర్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో రూపొందిన యానిమల్ అల్రెడీ ఇండిపెండెన్స్ వీక్ ని లాక్ చేసుకుంది. ఇంకోవైపు సన్నీ డియోల్ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ సీక్వెల్ గదర్ 2 ని ఎట్టి పరిస్థితుల్లో ఆ డేట్ కే రావడం ఖాయమని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పేశారు. ఈ రెండు సినిమాలకు సౌత్ లోనూ మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి తేలిగ్గా తీసుకోలేం.

ఇవి చాలక రజనీకాంత్ జైలర్ సైతం ఈ తేదీ మీదే కన్నేసింది. ఇన్ని సమీకరణాలు అంచనాల మధ్య ఫైనల్ గా ఎవరు మిగులుతారో చెప్పడం కష్టంగా ఉంది. ఈ మధ్య కీలకమైన సీజన్లన్నీ సంక్రాంతిని తలపిస్తున్నాయి. లాంగ్ వీకెండ్ కోసం భారీ ఓపెనింగ్స్ కోసం రిస్క్ ఉన్నా సరే బడా పోటీకి సై అంటున్నారు నిర్మాతలు. చిరంజీవి బాలకృష్ణలు ఒక్క రోజు గ్యాప్ తో తలపడినా ఇద్దరూ లాభపడటంతో మిగిలినవాళ్లకూ ధైర్యం వచ్చింది. అయినా ఇంత ముందస్తుగా ఎప్పుడో వచ్చే ఆగస్ట్ గురించి ఈ రేంజ్ లో ప్లాన్ చేసుకోవాలా అంటే తప్పదు మరి డిమాండ్ అలా ఉంది.