కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత

దైవ లిఖితం అంటే ఇదేనేమో. తెలుగు సినిమాని మేలి మలుపు తిప్పిన శంకరాభరణం విడుదలైన ఫిబ్రవరి 2నే దర్శకులు కె విశ్వనాథ్ గారు శివైక్యం చెందడం చూస్తే అది నిజమే అనిపిస్తుంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈ కళాతపస్వి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ లో తన చివరి శ్వాస తీసుకోవడం యావత్ పరిశ్రమతో పాటు కోట్లాది అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తింది. 1930 సుబ్రహ్మణ్యం, సరస్వతమ్మలకు జన్మించిన విశ్వనాథ్ గారి స్వస్థలం గుంటూరు జిల్లా పెదపులివర్రు గ్రామం. బిఎస్సి దాకా చదువుకున్న ఆయన 21 ఏళ్ళ వయసుకే తండ్రి ప్రోత్సాహంతో మదరాసు వాహిని స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టారు

అసిస్టెంట్ డైరెక్టర్ గా 1951లో తన ప్రయాణం ఎన్టీఆర్ పాతాళభైరవితో మొదలుపెట్టారు. ఆ తర్వాత పద్నాలుగేళ్లకు 1965లో అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా అక్కినేని నాగేశ్వరరావు గారు ఆత్మగౌరవంతో దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చారు. ఇది ఘనవిజయం సాధించడమే కాదు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు కూడా గెలుచుకుంది. అందాల నటుడు శోభన్ బాబుకి నల్లని మేకప్ వేసి చెల్లెలి కాపురంతో సూపర్ హిట్ కొట్టడం ఆయనకే చెల్లింది. శారద, ఓ సీత కథ, నేరము శిక్ష, జీవన జ్యోతి ఫ్యామిలీ ఆడియన్స్ లో విశ్వనాథ్ గారి అభిమానులను అశేషంగా పెంచాయి. చంద్రమోహన్ జయప్రద జంటగా సిరిసిరిమువ్వ(1976) నృత్య ప్రధానంగా రూపొంది అశేష ప్రజాదరణ పొందింది. వరకట్నంని ప్రశ్నిస్తూ చిరంజీవితో చేసిన శుభలేఖ మరో సాహసం.

ఇక శంకరాభరణం(1980) ఒక చరిత్ర. ముసలాడిని హీరోగా పెట్టి తీస్తారా అని నవ్వినవాళ్ళు మళ్ళీ జన్మలో నోరెత్తకుండా ఏడాది ఆడిన అద్భుత కళాఖండమది. వేటూరి సాహిత్యం క్లిష్టంగా ఉన్నా కెవి మహదేవన్ సంగీతానికి పండిత పామరులు పులకరించిపోయారు. సాగర సంగమం (1983) ఎందరో యువత శాస్త్రీయ నృత్యం నేర్చుకోవడానికి ప్రేరేపించింది. ఇళయరాజాతో విశ్వనాథ్ గారి తొలి కలయిక ఇది. మెగాస్టార్ అయ్యాక చిరంజీవిని చెప్పులు కుట్టేవాడి పాత్రలో జీవింపజేసి మెప్పించడం ఇంకెవరికి సాధ్యం కాలేదు. బాలకృష్ణ జననీ జన్మభూమి, వెంకటేష్ స్వర్ణకమలం, రాజశేఖర్ శృతిలయలు, ఏఎన్ఆర్ సూత్రధారులు హీరోల ఇమేజ్ ని పక్కనపెట్టి తీసిన ఆణిముత్యాలు

అల్లరి నరేష్ హీరోగా వచ్చిన శుభప్రదం(2010) కె విశ్వనాథ్ గారికి దర్శకుడిగా చివరి సినిమా. నటుడిగా శుభసంకల్పం(1995) తో చేసిన తెరంగేట్రం ఆయన జీవితాన్ని మరో మలుపు తిప్పింది. అక్కడి నుంచి ఎన్నో బ్లాక్ బస్టర్లలో భాగం పంచుకున్నారు. హిందీలో తొమ్మిది సినిమాలను డైరెక్ట్ చేశారు. అయిదు సార్లు జాతీయ అవార్డు వరించగా, ఏడు నంది పురస్కారాలు, పది ఫిలిం ఫేర్లు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కేతో సత్కరించింది. ఫ్రాన్స్ గవర్నమెంట్ 1981లో ప్రైజ్ అఫ్ ది పబ్లిక్ గా గౌరవించడం మరో కలికితురాయి. కమర్షియల్ దర్శకులు ఎందరు ఉన్నా కె విశ్వనాథ్ లాంటి ఉత్తమాభిరుచి కలిగిన కళాప్రేమికులు సేవకులు కొందరే. అందుకే వారి జన్మ ధన్యం.