ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల గుండెల్లో పిడుగు పడేలా రాత్రి ప్రీమియర్లు క్యాన్సిల్ కావడం యావత్ ఎగ్జిబిటర్లను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. 14 రీల్స్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఇంకా కొలిక్కి రాని కారణంగా సమయానికి షోలు వేయలేకపోతున్నారని ఇన్ సైడ్ టాక్. ప్రొడక్షన్ హౌస్ నుంచి రద్దు గురించి మాత్రమే నోట్ వచ్చింది కానీ ఇంకెలాంటి వివరాలు లేవు. ఏపీలో ఇప్పటికే అమ్మేసిన లక్షలాది టికెట్లకు రీ ఫండ్ ప్రాసెస్ మొదలైపోయింది. నేరుగా కొన్నవాళ్ళకు డబ్బులు ఇవ్వనున్నారు.

ఇది హఠాత్ పరిణామం. బాలకృష్ణ లాంటి అగ్ర హీరో నటించిన సినిమాకు ఎదురవ్వాల్సిన స్థితి కాదు. ఒక ప్రణాళికతో ఇంత కష్టపడి ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చి, నార్త్ లోనూ పబ్లిసిటీ చేశాక ఇలా చివరి నిమిషంలో ఆటలు లేవంటే దాని తాలూకు నష్టం మాములుగా ఉండదు. అసలే ప్రీమియర్ల కోసం ప్రత్యేక అనుమతులు తీసుకుని 600 రూపాయల చొప్పున ఏపీలో అమ్మారు. ఇప్పుడా రెవిన్యూ అంతా పోయినట్టే. ఒకవేళ రేపు ఉదయం నుంచి మొదలుపెట్టినా సాధారణంగా అనుమతించిన రేట్లకే పెట్టాలి కాబట్టి ఓవరాల్ ఓపెనింగ్ లో తీవ్ర కోత పడనుంది.

ఇక తర్వాతి అడుగు రేపు ఉదయం షెడ్యూల్ చేసిన 7 గంటల నుంచి మొదలవ్వాల్సిన ఆటలు. ఇది కూడా ఫైనాన్సియల్ క్లియరెన్స్ మీద ఆధారపడి ఉంటుందని అంతర్గత వర్గాలు అంటున్నాయి. నిర్మాతల వైపు సాంకేతిక కారణాలు చెబుతున్నా నిజానిజాలు ఏంటనేది కొద్దిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి ఇలా జరగకుండా ఉండాల్సిందని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో వారాల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు హౌస్ ఫుల్స్స్ తో కళకళలాడతాయని ఎదురు చూస్తున్న తరుణంలో ఇలా జరగడం ముమ్మాటికీ విచారించాల్సిన విషయం.