పూరీ ఫ్యాన్స్.. ఇది ఫాలో అవ్వాల్సిందే

జీవిత సారాన్ని తూటాల్లాంటి మాట‌ల‌తో.. సూటిగా సుత్తి లేకుండా చెప్ప‌గ‌ల నైపుణ్యం ఉన్న రైట‌ర్ క‌మ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్. ఈ త‌రం యువ‌త‌కు ఏ స్ట‌యిల్లో చెబితే విష‌యం ఎక్కుతుందో ఆయ‌నకు చాలా బాగా తెలుసు. నేనింతే, బిజినెస్‌మేన్ లాంటి సినిమాల్లో పూరి బోధించిన జీవిత పాఠాలు చాలామంది మ‌న‌సుల్లోకి దూసుకెళ్లిపోయాయి.

ఆ మాట‌లు ప్రీచింగ్‌లా అనిపించ‌కుండా ఆలోచింప‌జేసేలా.. చురుకు పుట్టించేలా ఉంటాయి. పూరి ఏదైనా చెబుతుంటే విన‌బుద్ధేయ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ఐతే త‌న ఐడియాల‌జీని జ‌నాల్లోకి తీసుకెళ్లేందుకు సినిమాలు, సినిమా వేడుక‌లకు ప‌రిమితం అయిపోకుండా ఇప్పుడో కొత్త మార్గాన్ని ఎంచుకున్నాడు పూరి.

త‌మ భావాలు చెప్ప‌డానికి ప్ర‌ముఖులు ఎంచుకున్న మీడియాలోకి పూరి కూడా వ‌చ్చేశాడు. పోడ్‌కాస్ట్‌లో ఆయ‌న అకౌంట్ తెరించారు. అందులో మ్యూజింగ్స్ పేరుతో త‌న భావాలు, అనుభ‌వాలు, పాఠాలు పంచుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. అరంగేట్రంలోనే చ‌క్క‌టి ఆడియో మెసేజ్‌ల‌తో త‌న అభిమానుల్ని ఆక‌ర్షించారు పూరి. అంద‌రూ గొప్ప అనుకునే అమెరికాకు అస‌లు చ‌రిత్ర‌, సంస్కృతి అంటూ ఏమీ లేవ‌ని.. వాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త విష‌యాల గురించి ఆలోచిస్తుంటార‌ని.. కానీ గొప్ప చ‌రిత్ర‌, సంస్కృతి ఉన్న ఇండియ‌న్స్ వాటిలోకి వెళ్ల‌కుండా, కొత్త‌గా ఏ ప్ర‌య‌త్న‌మూ చేయ‌కుండా క‌ష్టం తెలియ‌కుండా కాలం గ‌డిపేస్తుంటార‌ని అన్నాడు పూరి.

జ‌నాభా పెరుగుద‌ల‌తో వ‌స్తున్న క‌ష్టాల గురించి కూడా ఇందులో పూరి చ‌క్క‌గా వివ‌రించాడు. మ‌రోవైపు అమితాబ్ బ‌చ్చ‌న్ మీద కూడా ఆస‌క్తిక‌ర ఆడియో సందేశం పెట్టాడు. ఇవి విన్న ఎవ‌రైనా.. ఇక రెగ్యుల‌ర్‌గా పోడ్‌కాస్ట్‌లో పూరీని ఫాలో అయిపోవాల్సిందే అనుకుంటారు. ప్ర‌కాష్ రాజ్ స‌హా అంద‌రూ పూరి ఫ్యాన్స్‌కు ఇదే పిలుపునిచ్చారు.