250 రూపాయ‌ల‌తో పూన‌కాల ట్యూన్

ఒక‌ప్పుడు మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇచ్చి త‌న‌కు తానే సాటి అనిపించుకున్న స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ దేవిశ్రీ ప్ర‌సాద్.. ఈ మ‌ధ్య అంచ‌నాల‌కు అందుకోలేక‌పోతున్నాడు. సంక్రాంతికి రిలీజ్ కానున్న మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తేరు వీర‌య్య‌కు అత‌ను అందించిన పాట‌ల‌కు మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చింది. టైటిల్ సాంగ్ మిన‌హా పాట‌లు సాధార‌ణంగా అనిపించాయి.

అందులోనూ చివ‌ర‌గా విడుద‌లైన పూన‌కాలు లోడింగ్ పాట విష‌యంలో విప‌రీత‌మైన నెగెటివిటీ క‌నిపించింది. దేవి మీద ఒక రేంజిలో ట్రోలింగ్ జ‌రిగింది. ముఖ్యంగా ఒక ప్లాస్టిక్ గొట్టం లాంటిది నోట్లో పెట్టుకుని ఈ పాట లిరిక‌ల్ వీడియోలో దేవి ఊదుతూ క‌నిపించిన విజువ‌ల్ ట్రోలర్స్‌కు కావాల్సినంత కంటెంట్ ఇచ్చింది. ఈ బూర ఊదే సౌండే పాట ఆసాంతం వినిపించ‌డం కొంచెం చికాకుగా అనిపించింది శ్రోత‌ల‌కు.

ఈ ప్లాస్టిక్ గొట్టం వెనుక క‌థేంటో ద‌ర్శ‌కుడు బాబీ, కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్‌ల‌తో క‌లిసి ఇచ్చిన ఒక ప్ర‌మోష‌న‌ల్ ఇంట‌ర్వ్యూలో దేవి స్వ‌యంగా వెల్ల‌డించాడు. దేవి ఇండియాలో అయినా, ఫారిన్లో అయినా ఎక్క‌డెళ్లినా కొత్త కొత్త సంగీత ప‌రిక‌రాలు కొంటుంటాడ‌ట‌. ఒక‌సారి గోవాకు వెళ్లి అక్క‌డో ప‌రిక‌రం కోసం వెతుకుతున్న‌పుడు ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ షాపులో చిన్న‌పిల్ల‌ల బొమ్మ‌లు క‌నిపించాయ‌ట‌. అందులో ఈ ప్లాస్టిక్ గొట్టం ఇంట్రెస్టింగ్‌గా అనిపించి కొన్నాడ‌ట దేవి. దాని ధ‌ర కేవ‌లం 250 రూపాయ‌ల‌ట‌. ఆ గొట్టం ఊదినిపుడు వ‌చ్చే సౌండు డిఫ‌రెంటుగా అనిపించి.. దాన్ని భ‌ద్రంగా దాచుకున్నాడ‌ట‌. పూన‌కాలు లోడింగ్ పాట కోసం ఆ గొట్టాన్నే ఉప‌యోగించి ట్యూన్ రెడీ చేశాడ‌ట‌.

అలా కేవ‌లం 250 రూపాయ‌లు పెట్టి కొన్ని ప్లాస్టిక్ గొట్టం.. ఇంత పెద్ద పాట‌కు ట్యూన్‌గా మారింద‌ని.. ఈ పాట‌కు థియేట‌ర్లు షేక్ అయిపోతాయ‌ని దేవి వ్యాఖ్యానించాడు.