విశాల్‌కు నెగెటివిటీ దెబ్బేసిందా?

కొన్ని నెలల కిందట యువ కథానాయకుడు నితిన్ సినిమా ‘మాచర్ల నియోజకవర్గం’కు బాక్సాఫీస్ దగ్గర పెద్ద షాకే తగిలింది. ఆ సినిమా బాగా లేకపోవడం వల్ల డిజాస్టర్ అయిన మాట వాస్తవమే కానీ.. నితిన్ గత సినిమాలతో పోలిస్తే దీనికి సరిగ్గా ఓపెనింగ్స్ కూడా రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే సినమా తుస్సుమనిపించింది. టాలీవుడ్లో అసలు నెగెటివిటీ లేని హీరోల్లో ఒకడైన నితిన్.. ఈ చిత్రం విషయంలో మాత్రం బాగా నెగెటివిటీ ఎదుర్కొన్నాడు. ఐతే అందులో అతడి తప్పేమీ లేదు.

ఈ చిత్రంతో దర్శకుడిగా మారిన ఎడిటర్ శేఖర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని అనే విషయం లేటుగా వెలుగులోకి వచ్చి గతంలో అతను ప్రత్యర్థి పార్టీల మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హైలైట్ అయి దర్శకుడిగా అతడి తొలి చిత్రం మీద విపరీతమైన నెగెటివ్ ప్రచారానికి కారణమయ్యాయి. ఏపీలో జగన్ సర్కారు మీద వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతున్న టైంలో శేఖర్ పాత కామెంట్ల మీద దుమారం రేగి అదంతా సినిమా మెడకు చుట్టుకోవడం గమనార్హం.

జనాల మూడ్‌ అనేది ఈ సినిమా విషయంలో వ్యతిరేకంగా పని చేసిందని చెప్పాలి. ఇప్పుడు విశాల్ సైతం ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నట్లుగా కనిపిస్తోంది. అతను తాజాగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కొనియాడడం.. ‘ఐ లవ్ జగన్’ అని స్టేట్మెంట్ ఇవ్వడం.. టీడీపీ, జనసేన మద్దతుదారులకు అస్సలు నచ్చలేదు. దీంతో సోషల్ మీడియాలో అతడి కొత్త చిత్రం ‘లాఠీ’ గురించి బాగా నెగెటివ్ ప్రచారం జరిగింది.

సినిమాలు ఆడే సిటీలు, టౌన్లలో జనాల మూడ్ కూడా జగన్ సర్కారు విషయంలో వ్యతిరేకంగా ఉండడం వల్లో ఏమో..ఆ ఎఫెక్ట్ ‘లాఠీ’ మీద గట్టిగా పడినట్లు తెలుస్తోంది. విశాల్ గత చిత్రాలతో పోలిస్తే దీనికి కనీస ఓపెనింగ్స్ రాలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ దగ్గరే సినిమా తేలిపోయింది. రిలీజ్ రోజు సినిమాకు బాగా నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. ఈ చిత్రం మీద పెట్టిన మూడు కోట్ల పెట్టుబడిలో సగం కూడా వెనక్కి వచ్చేలా కనిపించడం లేదు.