సాయిపల్లవి బాలీవుడ్ ఎంట్రీ?

ప్రస్తుతం ఇండియా మొత్తంలో ఉత్తమ నటీమణుల జాబితా తీస్తే సాయిపల్లవి పేరు అందులో తప్పకుండా ఉంటుంది. దక్షిణాదిన అంతటా ఆమెకు తిరుగులేని గుర్తింపు ఉంది. కేవలం సాయిపల్లవి అనే పేరు చూసి థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య చాలా పెద్దదే. మలయాళం, తమిళం, తెలుగు.. ఇలా పలు భాషల్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. కన్నడిగులు సైతం ఆమెను అభిమానిస్తారు.

ఇక సాయిపల్లవి జెండా ఎగరేయాల్సింది ఉత్తరాదినే. ఆమెకు ఇంతకుముందే బాలీవుడ్ ఆఫర్లు వచ్చినా ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. సినిమాల విషయంలో ఆమె ఎంత చూజీగా ఉంటుందో తెలిసిందే. ఐతే ఎట్టకేలకు సాయిపల్లవి ఓ హిందీ సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో సాయిపల్లవి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

రామాయణ గాథ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రణబీర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటిస్తారట. ముందు ఈ పాత్ర కోసం దీపికా పదుకొనేను అనుకున్నారని.. ఆ తర్వాత కరీనా కపూర్ పేరు కూడా తెర మీదికి వచ్చిందని. కానీ ప్రస్తుత దశలో వాళ్లు ఈ పాత్రకు సెట్ కాదనే ఉద్దేశంతో సాయిపల్లవిని సంప్రదించారని.. భారీ ప్రాజెక్టు కావడం, అందులోనూ సీత పాత్ర కావడంతో సాయిపల్లవి ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ రావణాసురుడి పాత్ర చేస్తాడని కూడా ప్రచారం సాగిస్తున్నారు.

ఈ కాంబినేషన్ అయితే క్రేజీగానే అనిపిస్తోంది కానీ.. ఆల్రెడీ ‘ఆదిపురుష్’ రామాయణం నేపథ్యంలో తెరకెక్కింది.. మరోవైపు అల్లు అరవింద్ రామాయణం నేపథ్యంలో ఓ ప్రాజెక్టు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి కొత్తగా అదే కథతో ఇంకో సినిమా ఏంటి అన్నదే డౌటు. ప్రస్తుతానికి దక్షిణాదిన సాయిపల్లవి పెద్దగా సినిమాలేవీ చేయట్లేదు.