అతిగా ఫోన్ వాడిన షకీలా ఇప్పుడు ఎలా ఉందంటే…

ఒకప్పుడు షకీలాకు సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. వరుస సినిమాలు, భారీ గుర్తింపు, తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌తో ఆమె చాలా కాలం ప్రేక్షకుల్లో నిలిచిపోయారు. అయితే కాలం మారేకొద్దీ షకీలా సినిమాలకు దూరమయ్యారు. ఆర్ధికంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నట్లు పలుమార్లు తెలిపారు. అప్పుడప్పుడు టీవీ షోలు, ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తూ వస్తున్నారు.

ఇప్పుడు షకీలా మెడకు సర్జరీ చేయించుకున్న విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆమె మెడకు కాలర్ వేసుకుని కనిపిస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని రోజులుగా మెడకు సంబంధించిన తీవ్ర సమస్యతో బాధపడిన ఆమె చివరకు సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

తనకు ఈ సమస్య రావడానికి ఎక్కువసేపు మొబైల్ ఫోన్ వాడటం కూడా ఒక కారణమని షకీలా చెప్పడం షాక్ కు గురిచేస్తోంది. మంచంపై ఒక వైపు పడుకుని గంటల తరబడి గేమ్స్ ఆడటం, రీల్స్ చూడటం అలవాటుగా మారిందని ఆమె వెల్లడించారు. ఇలా ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో ఉండటం వల్ల మెడపై ఒత్తిడి పెరిగిందని ఆమె చెప్పినట్లు రిపోర్ట్స్ పేర్కొన్నాయి. ఈ సమస్యకు చికిత్సగా సర్జరీ చేయించుకున్నానని, దానికి దాదాపు రూ.3 లక్షల వరకు ఖర్చయిందని షకీలా తెలిపారు. ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్న ఆమె కొన్ని పనులకు ఇతరుల సహాయం తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు.

తనకు ఎదురైన పరిస్థితిని చెబుతూ మొబైల్ ఫోన్‌ను అవసరానికి మించి వాడొద్దని షకీలా సూచించారు. ముఖ్యంగా పిల్లలకు ఎక్కువసేపు ఫోన్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని ఆమె కోరారు. ఒకప్పుడు వెండితెరపై తనకంటూ భారీ క్రేజ్ సంపాదించుకున్న షకీలా ఇప్పుడు ఇలా మెడకు కాలర్‌తో కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఆమె ప్రస్తుతం చికిత్స తర్వాత కోలుకుంటున్నారని తెలుస్తోంది.