ఫ్యాన్స్ వద్దా జాన్వీ మేడమ్?

ఏఐ రంగప్రవేశం తర్వాత తమ ఫొటోలు, వీడియోలను ఇష్టానుసారం వాడేస్తున్న నేపథ్యంలో పర్సనాలిటీ రైట్స్ కోసం ఫిలిం సెలబ్రెటీలను న్యాయస్థానాలను ఆశ్రయిస్తుండడం, వారికి అనుకూలంగా కోర్టులు ఆదేశాలు జారీ చేస్తుండడం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ భామ జాన్వి కపూర్ కూడా తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 

ఐతే జాన్వి పర్సనాలిటీ రైట్స్ కాపాడ్డం మీద హైకోర్టు సానుకూలంగానే స్పందించినప్పటికీ.. తన పేరిట ఉన్న ఫ్యాన్ క్లబ్స్ మీద నిషేధం విధించడానికి మాత్రం నిరాకకరించింది. జాన్వి పేరు మీద అనేక ఫ్యాన్ క్లబ్స్, పేజీలు ఏర్పాటు చేసి.. డీప్ ఫేక్, ఏఐ వాడి అశ్లీల కంటెంట్ తయారు చేస్తున్నారని జాన్వి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి కొన్ని ఫ్యాన్ పేజీ లింకులతో పాటు 4 వేల వెబ్ సైట్ లింక్స్‌ను కూడా కోర్టుకు సమర్పించారు. వీటన్నింటినీ రద్దు చేయాలని కోరారు.

దీనిపై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆన్ లైన్ విమర్శలు, దూషణలు ప్రజా జీవితంలో భాగమైపోయాయని పేర్కొంటూ.. జాన్వి పేరుపై ఉన్న అభిమాన సంఘాలపై నిషేధం విధించడానికి నిరాకరించింది. అశ్లీలత, అభ్యంతర కంటెంట్ ఉంటే చర్యలు తీసుకోవచ్చు కానీ.. అన్ని ఫ్యాన్ క్లబ్‌లనూ ఎలా మూసేయగలమని కోర్టు ప్రశ్నించింది. అన్ని ఫ్యాన్ పేజీలూ తప్పుగా ప్రవర్తించడం లేదని, కొన్ని అభిమానంతో క్రియేట్ చేసినవి ఉండొచ్చని పేర్కొన్న కోర్టు.. మీకు అభిమానులు వద్దా అని జాన్వి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. 

ఫ్యాన్ పేజీలన్నింటినీ చట్టవిరుద్ధమైనవిగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది. తన పేరు మీద పేజీలు పెట్టి ఏఐ ద్వారా అశ్లీల కంటెంట్ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారన్నది జాన్వి అభ్యంతరంగా తెలుస్తోంది. హిందీలో పలు చిత్రాల్లో నటించిన జాన్వి.. తెలుగులో ‘దేవర’తో ఎంట్రీ ఇచ్చింది. ఇటీవల ఆమె ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.