ఓజిలో విలన్ గా పరిచయమైన ఇమ్రాన్ హష్మీ ఒకప్పుడు బాలీవుడ్ సోలో హీరోగా మంచి మార్కెట్ ఎంజాయ్ చేసిన వైనం మూవీ లవర్స్ కు గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా ముద్దుల వీరుడిగా ఇతని పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆషిక్ బనాయా ఆప్నే, మర్డర్, గ్యాంగ్ స్టర్ లాంటి బ్లాక్ బస్టర్లు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. కొన్నేళ్లు స్టార్ ఇమేజ్ అనుభవించాక వరస ఫ్లాపులతో కొంత బ్రేక్ తీసుకున్నాడు. ఈ మధ్య నెగటివ్ క్యారెక్టర్స్ నచ్చినా నో చెప్పకుండా చేస్తున్నాడు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇమ్రాన్ హష్మీ కొత్త మూవీ ఆవారాపన్ 2 రేపు విడుదలవుతోంది. అసలు విశేషం ఇది కాదు. పంతొమ్మిది సంవత్సరాల క్రితం ఆవారాపన్ రిలీజయ్యింది. తెలుగులో బిజీ ఉన్నప్పటికీ శ్రియ శరన్ ఇందులో హీరోయిన్ గా నటించింది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ టైంలో ఇది ఫ్లాప్. పద్దెనిమిది కోట్ల బడ్జెట్ తో తీస్తే కేవలం పన్నెండు కోట్ల దగ్గర ఆగిపోయింది. తర్వాత శాటిలైట్ ఛానల్స్, హోమ్ వీడియో, ఓటిటిలో వచ్చాక కల్ట్ అనిపించుకుంది.
అలాంటి ఆవారాపన్ కొనసాగింపు ఇప్పుడు వస్తోంది. ఇందులో శ్రియ శరన్ లేదు. దర్శకత్వం మోహిత్ సూరి నుంచి నితిన్ కక్కర్ తీసుకున్నారు. ట్విస్ట్ ఏంటంటే అమీర్ ఖాన్ నిర్మించి సన్నీ డియోల్ హీరోగా నటించిన బట్వారా 1947 కంటే ఆవారాపన్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. హైదరాబాద్ సాయంత్రం షోలు ఎక్కువగా ఇమ్రాన్ హష్మీకే త్వరగా ఫుల్ అవుతున్నాయి. ఇక్కడే ఇలా ఉంటే ఇక ముంబై, కోల్కతా, ఢిల్లీ తదితర ఉత్తరాది నగరాల్లో ఎలా ఉంటుందో చెప్పాలా.
కల్కి ఫేమ్ దిశా పటాని ఆవారాపన్ 2లో మెయిన్ హీరోయిన్. మొదటి భాగంలాగే ఈసారి కూడా గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నప్పటికీ ట్రీట్ మెంట్, స్టోరీ లైన్ కొత్తగా ఉంటాయట. థియేటర్ రిలీజ్ టైంలో ఫస్ట్ పార్ట్ మిస్సయినవాళ్లు అది ఫ్లాప్ అనే సంగతి తెలిసి సోషల్ మీడియాలో ఆశ్చర్యపోతున్నారు. ఇన్నేళ్లు తాము సూపర్ హిట్ అనుకున్న మూవీ అసలు రిలీజ్ టైంలో పెద్దగా ఆడలేదని తెలిసి షాక్ అవుతున్నారు. మరి ఇప్పుడైనా బ్లాక్ బస్టర్ కట్టబెడతారో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates