ఫ్యాన్స్ ఆసక్తిని చంపేస్తున్న స్పెషల్ షోలు

పెరుగుట విరుగుట కొరకే అని పెద్దలు ఊరికే అనలేదు. ఇటీవలి కాలంలో రీ రిలీజుల పేరుతో మొదలైన ట్రెండ్ ని అత్యాశతోనో అత్యుత్సాహంతోనో వాటిని పంపిణి చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లే చంపేసేలా ఉన్నారు. ప్రేక్షకులు ఒక్కడుని బాగా చూశారు. ఘరానా మొగుడుని పాస్ చేశారు. పోకిరిని బ్రహ్మాండంగా ఆదరించారు. జల్సాకి ఏకంగా రికార్డులు ఇచ్చారు. చెన్నకేశవరెడ్డికి ఓవర్సీస్ లోనూ పట్టం దక్కింది. నువ్వే నువ్వేని ఫ్యామిలీ ఆడియన్స్ మళ్ళీ థియేటర్లకొచ్చి చూస్తున్నారు. వర్షం ఈ వారమే వస్తోంది. ఇవన్నీ ఏ టైంలో అయినా సరే ఎంజాయ్ చేయగలిగే ఆల్ టైం బ్లాక్ బస్టర్లు సూపర్ హిట్లు కాబట్టి ఓకే.

ఇదంతా బాగానే ఉంది కానీ డిజాస్టర్లను యావరేజ్ లను కూడా రీ రిలీజులకు తెగబడటం ఆయా హీరోల అభిమానులకే అసంతృప్తిని కలగజేస్తోంది. గత నెల ప్రభాస్ పుట్టినరోజు పేరుతో రెబల్ కి స్పెషల్ షోలు వేయడం ఫ్యాన్స్ కే నచ్చలేదు. అయినా సరే కలెక్షన్లు సందడి లేకపోతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవ్వొచ్చనే ఉద్దేశంతో మార్నింగ్ షోలకు బాగానే వెళ్లారు. కట్ చేస్తే మిగిలిన ఆటలకు జనం లేక పెద్దగా ఆక్యుపెన్సీ రాక వసూళ్లు రాలేదు, బయటికి చెప్పుకోలేదు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బాద్షాని నవంబర్ 18కి రెడీ చేస్తున్నారు. అయినా ఆది, సింహాద్రి, స్టూడెంట్ నెంబర్ 1న వదిలేసి ఇది చేయడం మింగుడు పడటం లేదు.

దీని వెనుక కేవలం బిజినెస్ చేసుకోవడం తప్ప మరో ఉద్దేశం ఏమీ లేదనే కామెంట్స్ ఉన్నాయి. ఫ్యాన్స్ ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవడం కోసమే ఇలా ప్రతి సినిమాను రీ రిలీజ్ చేయాలని చూస్తే రాబోయే రోజుల్లో నిజమైన క్లాసిక్స్ కి పబ్లిక్ దూరమయ్యే ప్రమాదం ఉంది. పోనీ వీటినేమైనా స్పెషల్ రేట్లకు టికెట్లు అమ్ముతున్నారా అంటే అదీ లేదు. కొత్తగా రిలీజైన వాటికి ఏ ధర ఉందో అంతే పెట్టి వసూలు చేస్తున్నారు. యుట్యూబ్ లో ఇవన్నీ ఫ్రీగా దొరికేవే. అలాంటప్పుడు కనీసం రాయితీ ఇచ్చే ఆలోచనైనా చేయకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు. కథ ఇక్కడితో అయిపోలేదు. నవంబర్ నుంచి జనవరి మధ్య పదికి పైగా రీ రిలీజులు ఉన్నాయట.