కొత్త హిందీ సినిమా క‌లెక్ష‌న్లు 15 ల‌క్ష‌లు

ప‌రిణీతి చోప్రా హిందీలో కాస్త పేరున్న హీరోయినే. ఇషాక్ జాదే, శుద్ దేశీ రొమాన్స్, గోల్ మాల్ అగైన్ లాంటి హిట్ సినిమాల్లో న‌టించి స్టార్ స్టేట‌స్ సంపాదించిన ఈ అమ్మాయి ప్ర‌ధాన పాత్ర‌లో తాజాగా కోడ్ నేమ్ తిరంగా అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో న‌టించింది. బాలీవుడ్ టాప్ ప్రొడ్యూస‌ర్ల‌లో ఒక‌డైన భూష‌ణ్ కుమార్ ఇందులో నిర్మాణ భాగ‌స్వామి రిబు దాస్ గుప్తా అనే బెంగాలీ ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు.శుక్ర‌వారం రిలీజైన ఈ చిత్రానికి తొలి రోజు వ‌చ్చిన వ‌సూళ్లు చూసి బాలీవుడ్ షాకైపోతోంది.

ఇండియా మొత్తంలో ఈ సినిమా శుక్ర‌వారం కేవ‌లం రూ.15 ల‌క్ష‌ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ప‌రిణీతి చివ‌ర‌గా న‌టించిన మ‌రో లేడీ ఓరియెంటెడ్ మూవీ సైనాకు తొలి రోజు రూ.50 ల‌క్ష‌ల వ‌సూళ్లే వ‌చ్చాయి. అది చూసే ట్రేడ్ వ‌ర్గాలు షాక‌య్యాయి. మ‌రీ ఇంత త‌క్కువ వ‌సూళ్లా అనుకున్నాయి.

ఐతే స్పోర్ట్స్ బ‌యోపిక్స్ మీద అంత‌కంత‌కూ ఆస‌క్తి త‌గ్గిపోతుండ‌డం, ప‌రిణీతి కూడా ఫాంలో లేక‌పోవ‌డంతో వ‌సూళ్లు అంత త‌గ్గాయేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె న‌టించిన స్పై థ్రిల్ల‌ర్ కోడ్ నేమ్ తిరంగాకు మ‌రీ దారుణ‌మైన వ‌సూళ్లు వ‌చ్చాయి. రూ.15 ల‌క్ష‌లు అంటే రిలీజ్ ఖ‌ర్చులు, థియేట‌ర్ల మెయింటైనెన్స్‌కి కూడా స‌రిపోని క‌లెక్ష‌న్న‌మాట‌. గ‌తంలో బాలీవుడ్ నుంచి ఎంత చెత్త సినిమా వ‌చ్చినా తొలి రోజు మినిమం కోటి రూపాయ‌ల క‌లెక్ష‌న్ ఉండేది. కానీ కొవిడ్ త‌ర్వాత ప‌రిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

హిందీ సినిమాలు చూడ్డానికి ఉత్త‌రాది ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌డం బాగా త‌గ్గించేశారు. ఓటీటీల‌కు బాగా అల‌వాటు ప‌డిపోయారు. పెద్ద హీరోల సినిమాల‌నే ప‌ట్టించుకోవ‌డం లేదు. చాలా సెలెక్టివ్‌గా థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప‌రిణీతి సినిమాకు ఈ ప‌రాభ‌వం అని అర్థ‌మ‌వుతోంది. కాక‌పోతే ఈ సినిమాను ఓటీటీకి అమ్మేసి ఏదో నామ‌మాత్రంగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసిన‌ట్లు చెబుతున్నారు.