కాశ్మీర్లో ‘ సినిమా థియేటర్లు’.. ఇది చాలా పెద్ద విషయమే

దాదాపు 30 ఏళ్ళ తర్వాత కాశ్మీరులోయలో సినిమా హాళ్ళు తెరుచుకున్నాయి. కాశ్మీర్లోని పుల్వామా, శోపియా ప్రాంతాల్లో సినిమా థియేటర్లతో కూడిన మాల్స్ ను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రారంభించారు. సినిమా థియేటర్లు ప్రారంభించటం అదేమంత పెద్ద విషయమా అని అనిపించచ్చు. అవును నిజంగా కాశ్మీరు లోయ లో పెద్ద విషయం కాదు చాలా పెద్ద విషయమనే చెప్పాలి. ఎందుకంటే 1980ల్లో థియేటర్ల మూసివేత మొదలైంది. 1999 వచ్చేసరికి సంపూర్ణంగా మూతపడిపోయాయి.

మళ్ళీ 2022, సెప్టెంబర్ 18వ తేదీన రెండు ప్రాంతాల్లో రెండు మాల్స్ తెరుచుకున్నాయి. అందుకనే ఇది చాలా పెద్ద విషయమైంది. ఇంతకీ థియేటర్లను ఎందుకు మూసేశారంటే ఉగ్రవాదం కారణంగానే. ప్రభుత్వాలు, పాలకుల మీదున్న ఆగ్రహాన్ని ఉగ్రవాదులు, తీవ్రవాదులు మామూలు జనాల మీద చూపిస్తారు కదా. ఇదే పద్దతిలో కాశ్మీరు లోయలో కూడా ఉగ్రవాదులు మామూలు జనాల మీద చూపించటం మొదలుపెట్టారు.

అమాయకులు ఎంతమందిని చంపితే ఉగ్రవాదులకు అంత ఆనందం కదా అందుకనే తమ ఊచకోతకు జనాలు రద్దీగా ఉండే ప్రాంతాలను ఎంచుకోవటం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ తో పాటు మార్కెట్లు, థియేటర్లను టార్గెట్ గా చేసుకున్నారు. కొన్నివందలమంది జనాలు ఒక్కసారిగా జమయ్యేది సినిమా థియేటర్లలోనే కదా. అందుకనే థియేటర్లపై దాడులు చేయటం మొదలుపెట్టారు. దాంతో ఒక్కో థియేటర్ మూతపడిపోయింది.

దాడులు జరుగుతున్నా థియేటర్లకు జనాలు వస్తూండటాన్ని తీవ్రవాదులు తట్టుకోలేకపోయారు. అందుకనే థియేటర్లపై తుపాకులు, బాంబులతో యధేచ్చగా దాడులు చేశారు. దాంతో కొన్నివందలమంది చనిపోయారు. దాంతో ఇక లాభంలేదనుకుని ప్రభుత్వం 1999లో లోయ మొత్తం మీద థియేటర్లను మూసేయాలని డిసైడ్ అయ్యింది. అప్పటి నుండి థియేటర్లన్నవే లోయలో లేకుండా పోయాయి. అలాంటిది తాజాగా పుల్వామా, శోపియా ప్రాంతాల్లో థియేటర్లు తెరుచుకోవటంతో జనాలు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. అనంతనాగ్, శ్రీనగర్, బందిపోరా, గందర్ బల్, దోడా, రాజౌరి, పూంచ్, కిష్వారా, రియాసీలలో కూడా థియేటర్లు అందుబాటులోకి రాబోతున్నాయి.