బాలీవుడ్ కొత్త సినిమా.. వినూత్న ప్ర‌యోగం

బాలీవుడ్లో వినూత్న క‌థ‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచే ద‌ర్శ‌కుల్లో ఆర్.బాల్కి ఒక‌రు. కి అండ్ కా, పా, ష‌మితాబ్, ప్యాడ్ మ్యాన్.. ఈ సినిమాల వ‌రుస చూస్తే ఆయ‌న ఎంత విభిన్న‌మైన ద‌ర్శ‌కుడో అర్థ‌మ‌వుతుంది. ఇప్పుడాయ‌న చుప్ అనే సినిమా తీశారు. ఇది ఇప్ప‌టిదాకా ఇండియ‌న్ స్క్రీన్ మీద‌, ఆ మాటకొస్తే వ‌ర‌ల్డ్ లెవెల్లో చూడ‌ని క‌థాంశంతో తెర‌కెక్కింద‌ని చెప్పొచ్చు.

కొత్త సినిమాల‌ను రివ్యూ చేసి స్టార్ల‌తో రేటింగ్స్ ఇచ్చే క్రిటిక్స్‌ను వెతికి వెతికి హ‌త్య‌లు చేసే సీరియ‌ల్ కిల్ల‌ర్ స్టోరీ ఇది. మంచి సినిమాల‌కు త‌క్కువ రేటింగ్స్, చెడ్డ సినిమాల‌కు ఎక్కువ రేటింగ్స్ ఇచ్చే వారిని ఆ కిల్లర్ చంపుతుంటాడు. చంపాక వాళ్ల‌కు రేటింగ్స్ ఇస్తాడు. ఇందులో స‌న్నీ డియోల్, దుల్క‌ర్ స‌ల్మాన్ ముఖ్య పాత్ర‌లు పోషించారు.

ఈ నెల 23న చుప్ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా ఒక వినూత్న ప్ర‌యోగం చేస్తోంది బాల్కి టీం. మామూలుగా సినిమాల విడుద‌ల‌కు ముందు ప్రెస్, ఫిలిం సెల‌బ్రెటీల కోసం స్పెష‌ల్ ప్రివ్యూలు ప్లాన్ చేస్తుంటారు. కానీ చుప్ విష‌యంలో దీనికి భిన్నంగా సాధార‌ణ ప్రేక్ష‌కుల కోస‌మే ఫ్రీ స్పెష‌ల్ ప్రివ్యూలు ఏర్పాటు చేశారు.

ముంబ‌యి, ఢిల్లీ, హైద‌రాబాద్ స‌హా దేశ‌వ్యాప్తంగా అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ఈ సోమ‌వారం మ‌ధ్యాహ్నం స్పెష‌ల్ ప్రివ్యూలు వేస్తున్నారు. వీటిలో ప్ర‌వేశం ఉచితం. బుక్ మై షో ద్వారా టికెట్లు బుక్ చేసుకోవ‌చ్చు. ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ అన్న‌ట్లు టికెట్లు అందుబాటులోకి తెస్తున్నారు. ప్రేక్ష‌కులు సినిమా చూసి క్రిటిక్స్ కంటే ముందు త‌మ అభిప్రాయం చెప్పాల‌ని.. వారి ఒపీనియ‌న్ త‌మ‌కు కీల‌క‌మ‌ని అంటున్నాడు బాల్కి. బ‌హుశా ఫిలిం క్రిటిక్స్‌ను చంపే కిల్ల‌ర్ పాత్ర కావ‌డంతో వాళ్లు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహంతో సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు ఇలా స్పెష‌ల్ ప్రివ్యూలు వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది.