పాపం వర్మ.. చివరికి ఇలా

సినీ ప‌రిశ్ర‌మ‌లో రామ్ గోపాల్ వ‌ర్మ ఒక‌ప్పుడు ఎంత‌టి వైభ‌వం చూశాడో అంద‌రికీ తెలుసు. శివ‌, గాయం, రంగీలా, స‌త్య‌, కంపెనీ లాంటి చిత్రాల‌తో ఆయ‌న సృష్టించిన సంచ‌ల‌నాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి ద‌ర్శ‌కుడు గ‌త ద‌శాబ్ద కాలంలో ఎంత‌గా ప‌త‌నం అయ్యాడో కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఒక‌ప్పుడు వ‌ర్మ సినిమాలంటే ప‌డి చ‌చ్చిన వాళ్లు.. ఇప్పుడు ఆయ‌న సినిమా అంటేనే బెంబేలెత్తిపోతూ థియేట‌ర్ల‌కు పూర్తిగా దూరం అయిపోయారు.

గ‌తంలో మాదిరి ప‌బ్లిసిటీ గిమ్మిక్కులు కూడా ప‌ని చేయ‌క వ‌ర్మ బాగా ఇబ్బంది ప‌డుతున్నాడు. ఇటీవ‌ల రిలీజైన కొండా సినిమాకు క‌నీస స్పంద‌న లేక‌పోయింది. ఆ సినిమా రిలీజైన విష‌యాన్ని కూడా జ‌నాలు ప‌ట్టించుకోలేదు. ఆ సినిమా ప‌బ్లిసిటీ గ‌ట్టిగా చేసినా ఫ‌లితం లేక‌పోయింది. ఇప్పుడు ఇంకో సినిమాను బ‌య‌టికి తీయ‌డానికి వ‌ర్మ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టాడు.

ల‌డ్కీ పేరుతో ఆయ‌న ఒక మార్ష‌ల్ ఆర్ట్స్ మూవీ చేసిన సంగ‌తి తెలిసిందే. పూజా భ‌లేక‌ర్ అనే అమ్మాయిని పెట్టి బ్రూస్ లీ త‌ర‌హాలో ఫైట్లు చేయించ‌డ‌మే కాక‌.. వీర లెవెల్లో ఎక్స్‌పోజింగ్ కూడా చేయించాడు వ‌ర్మ‌. ఈ సినిమా ఎప్పుడో పూర్త‌యినా బిజినెస్ జ‌రక్క వాయిదాల మీద వాయిదాలు ప‌డుతూ వ‌స్తోంది. చివ‌రికి జులై 15న ల‌డ్కీని రిలీజ్ చేయాల‌ని చూస్తున్నాడు వ‌ర్మ‌. మామూలుగా ప‌బ్లిసిటీ చేస్తే జ‌నాలు ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని.. కొత్త రూట్లో ప్ర‌య‌త్నిస్తున్నాడు.

జులై 15నే రిలీజ‌వుతున్న మిథాలీ రాజ్ బ‌యోపిక్ శభాష్ మిథుతో దీనికి పోలిక పెడుతున్నాడు. తాప్సి లీడ్ రోల్ చేసిన ఆ సినిమా, త‌న చిత్రం రెండూ కూడా మ‌హిళా సాధికారత నేప‌థ్యంలో తెర‌కెక్కిన‌వే అని, మ‌గాళ్ల మీద మ‌హిళ‌ల ఆధిప‌త్యాన్ని చాటే చిత్రాలివని.. కాబ‌ట్టి జులై 15 డేట్ చాలా స్పెష‌ల్ అని ట్విట్ట‌ర్లో పోస్టులు పెడుతున్నాడు వ‌ర్మ‌. కానీ ఎంత చేసినా వ‌ర్మ సినిమాను జ‌నాలు ప‌ట్టించుకుంటారా అన్న‌ది సందేహ‌మే. ఇలాంటి ప‌బ్లిసిటీ గిమ్మిక్కులు చూసి ఎలాంటి ద‌ర్శ‌కుడు ఎలా అయిపోయాడు.. సినిమాను ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ఎన్ని క‌ష్టాలో అని కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌న్లు.