క‌మ‌ల్ రెడీ.. కానీ శంక‌ర్ లేడు

90వ ద‌శ‌కం చివ‌ర్లో వ‌చ్చిన ఇండియ‌న్ (తెలుగులో భార‌తీయుడు) సినిమా సృష్టించిన సంచ‌ల‌నాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. క‌థాక‌థ‌నాల్లో కొత్త‌ద‌నం చూపిస్తూనే క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు ఏమాత్రం లోటు లేకుండా శంక‌ర్ తీసిన ఈ చిత్రం భారీ విజ‌యాన్నందుకుంది. ఈ చిత్రానికి 20 ఏళ్ల త‌ర్వాత సీక్వెల్ తీయాల‌ని శంక‌ర్, క‌మ‌ల్ హాస‌న్ సిద్ధ‌మైతే అభిమానులు ఎంత‌గానో ఎగ్జైట్ అయ్యారు. 200 కోట్ల‌కు పైగా భారీ బ‌డ్జెట్లో లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టింది.

ఆరంభంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినా తర్వాత షూటింగ్ వేగంగానే జరిగింది. ఇంకో రెండు నెలలు పని చేస్తే చిత్రీకరణ పూర్తయ్యే దశలో యూనిట్లో జరిగిన క్రేన్ ప్రమాదం మొత్తం కథను మార్చేసింది. దెబ్బకు షూటింగ్ నిరవధికంగా వాయిదా పడింది. నిర్మాతల అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందంటూ కమల్ వారికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టడంతో షూటింగ్ పున:ప్రారంభం కాలేదు. ఈలోపు కమల్ రాజకీయాలు, కొవిడ్ కారణంగా సినిమా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా తయారైంది.

నిజానికి అప్పుడు షూటింగ్ చాన్నాళ్లు ఆగిపోవడానికి ప్రధాన కారణం కమలే. ఎక్కువ రోజులు ఎదురు చూడలేక శంకర్.. నిర్మాతలతో కోర్టులో పోరాడి మరీ రామ్ చరణ్‌తో తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించాడు. కొన్ని నెలల నుంచి శంకర్ ఆ సినిమాలోనే నిమగ్నమై ఉన్నాడు. ఇప్పుడేమో కమల్.. ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించే దిశగా ఉత్సాహం చూపిస్తున్నాడు. దర్శక నిర్మాతలతో మాట్లాడతా అంటున్నాడు. నిర్మాతల మీద కమల్ కోపం తగ్గింది కాబట్టి, ఇప్పుడు అందరితో మాట్లాడి సినిమాను త్వరలోనే తిరిగి పట్టాలెక్కిస్తా అంటున్నాడు. కానీ ఇప్పుడు శంకర్‌కు అస్సలు ఖాలీ లేదు.
చరణ్ సినిమా పూర్తయి రిలీజ్ కావడానికి ఇంకా ఆరు నెలల పైగానే సమయం పడుతుంది. ఒక సినిమా చేస్తూ ఇంకో సినిమా గురించి శంకర్ అస్సలు ఆలోచించడు. అలా అని శంకర్ కోసం ఆరు నెలలు కమల్ ఎదురు చూస్తూ ఉండే అవకాశం లేదు. ‘విక్రమ్’తో భారీ విజయాన్నందుకున్న ఆయన.. సాధ్యమైనంత త్వరగా ఇంకో సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నాడు. వేరే కొత్త ప్రాజెక్టులో పడితే.. మళ్లీ ఆయనకెప్పుడు ఖాళీ దొరుకుతుందో? ఇక ఇప్పటికే ఈ చిత్రం మీద రూ.180 కోట్ల దాకా ఖర్చు పెట్టిన నిర్మాతలు.. కొత్తగా లెక్కలేసుకుని అదనపు బడ్జెట్‌తో సిద్ధం కావాలి. ఈ నేపథ్యంలో ‘ఇండియన్-2’ పున:ప్రారంభమై పూర్తి కావడానికి చాలా సమయమే పట్టేలా ఉంది.