విక్రమ్ తెలుగు వెర్షన్ అందుకే లేట్

నిన్న సాయంత్రం విడుదలైన విక్రమ్ ట్రైలర్ ఆన్ లైన్లో దూసుపోతోంది. ఇంకా ఇరవై నాలుగు గంటలు కాకముందే 10 మిలియన్ల వ్యూస్ కు దగ్గరగా వెళ్ళిపోయి దీని మీద క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చూపిస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో విజువల్స్ ఈ జానర్ లవర్స్ ని అద్భుతమనిపించేలా చేశాయి. అందులోనూ కమల్ హాసన్ విజయ్ సేతుపతి ఫహద్ ఫాసిల్ లాంటి వర్సటైల్ యాక్టర్స్ కాంబినేషన్ కావడంతో అంచనాలు అంతకంతా పెరుగుతూ పోతున్నాయి.

నువ్వా నేనా అనే రీతిలో ముగ్గురి స్క్రీన్ ప్రెజెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సూర్య క్యామియో స్పెషల్ బోనస్ గా జోడించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ విక్రమ్ తెలుగు వెర్షన్ ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు. డబ్బింగ్ జరగలేదో లేక ఇక్కడి హక్కులను ఇంకా ఎవరు కొనలేదో క్లారిటీ లేదు కానీ సోషల్ మీడియాలో ఇదేం అన్యాయమంటూ కమల్ ఫ్యాన్స్ గట్టిగానే నిలదీస్తున్నారు. అయితే చెన్నై నుంచి వచ్చిన టాక్ మేరకు కమల్ హాసన్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పాలన్న ఉద్దేశంతో ఆలస్యం చేస్తున్నారట.

గతంలో గానగంధర్వులు ఎస్పి బాలసుబ్రమణ్యం చెప్పేవారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ఇపుడాయన లేరు. ఇంకెవరితోనో చెప్పిస్తే ఇంపాక్ట్ ఉండదు. పైపెచ్చు నెగటివ్ ఫీడ్ బ్యాక్ కి ఛాన్స్ ఉంది. అందుకే కమల్ తన గొంతునే వినిపిస్తారట. ఇదంతా ఎలా ఉన్నా సినిమా రిలీజ్ సమాంతరంగా అన్ని భాషల్లో ఒకేసారి జరుగుతున్నప్పుడు ప్రమోషన్ కూడా అలాగే ప్లాన్ చేసుకుని ఉంటే బాగుండేది. జూన్ 3న విడుదల కాబోతున్న విక్రమ్ కు అడవి శేష్ మేజర్, అక్షయ్ కుమార్ పృథ్విరాజ్ తో పోటీ ఉంది.