ఒక్క సీన్ కోసం 3 వేల కోట్లు వదులుకున్నారట


సినిమాల్లో కొన్ని సన్నివేశాలకు సెన్సార్ బోర్డులు అభ్యంతరాలు చెప్పడం.. కథా గమనానికి అవి పెద్ద అడ్డం కానపుడు చిత్ర బృందాలు వాటికి కోత వేయడం.. లేదంటే రివైజ్ కమిటీలకు వెళ్లి అనుమతులు సంపాదించడం మామూలే. వేరే అవకాశం లేనపుడు, సదరు సన్నివేశాల వల్ల సినిమా రిలీజే ఆగిపోతుంది అన్నపుడు ఎవరైనా ఏం చేస్తారు. సదరు సన్నివేశాన్ని తీసేయడానికే చూస్తారు.

అందులోనూ ఒక సన్నివేశం వల్ల వేల కోట్ల ఆదాయం పోతుందంటే ఏ చిత్ర బృందమైనా రాజీ పడకుండా ఉంటుందా? కానీ సోనీ పిక్చర్స్ మాత్రం దాదాపు రూ. వేల కోట్ల దాకా ఆదాయం పోతుందని తెలిసి కూడా ఒక సన్నివేశాన్ని తమ చిత్రం నుంచి తొలగించడానికి ఒప్పుకోలేదట. చివరికి అంత భారీ ఆదాయాన్ని వదులుకున్నారే తప్ప సదరు సన్నివేశాన్ని మాత్రం తొలగించలేదట. గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంచలన వసూళ్లు సాధించిన ‘స్సైడర్ మ్యాన్: నో వే హోమ్’ విషయంలో ఇలా జరిగిందట.

హాలీవుడ్ చిత్రాలకు అమెరికా తర్వాత అత్యధిక ఆదాయం వచ్చే దేశం అంటే చైనానే. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉండే ఆ దేశంలో మంచి క్రేజున్న హాలీవుడ్ సినిమాలను రిలీజ్ చేస్తే వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆమిర్ ఖాన్ సినిమా ‘దంగల్’యే అక్కడ రూ.1200 కోట్లు కొల్లగొట్టిందంటే ‘స్పైడర్ మ్యాన్’ ఫ్రాంఛైజీ చిత్రానికి అక్కడుండే క్రేజ్, వచ్చే వసూళ్లు ఎలా ఉంటాయో అంచనా వేయొచ్చు.

ఐతే ఈ సినిమాను గత ఏడాది చైనాలో రిలీజ్ చేయడానికి ముందు సెన్సార్ కోసం పంపగా.. పతాక సన్నివేశంలో ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ బ్యాక్ డ్రాప్‌లో జరిగే యాక్షన్ ఘట్టం విషయంలో చైనా సెన్సార్ బోర్డు అభ్యంతర పెట్టినట్లు తెలిసింది. కమ్యూనిస్టులు పాలించే చైనాలో పౌరులకు స్వేచ్ఛ ఉండదు. అలాంటి దేశంలో స్వేచ్ఛకు సూచిక అయిన ‘స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ’ను తెర మీద చూపిస్తే జనాల్లో వేరే భావనలు కలుగుతాయన్న ఉద్దేశంతో అది కనిపించే సన్నివేశాలన్నింటినీ తీసేయాలని సోనీ వారికి చైనా సెన్సార్ బోర్డు చెప్పిందట. చివరికి ఈ సన్నివేశాలను ట్రిమ్ చేయాలని సూచించిందట. కానీ సోనీ పిక్చర్స్ అందుకు నిరాకరించడంతో ‘స్పైడర్ మ్యాన్’ చైనాలో రిలీజ్ కానే లేదు. ప్రపంచవ్యాప్తంగా ‘నో వే హోమ్’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఈ సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా చైనాలో రూ.3 వేల కోట్ల దాకా ఆదాయం వచ్చేదట. కానీ చైనీస్ సెన్సార్ బోర్డు చెప్పినట్లు సదరు సన్నివేశం తీసేయకపోవడం వల్ల రిలీజ్ ఆగిపోయి ఇంత ఆదాయాన్ని కోల్పోయిందట సోనీ సంస్థ.