ఆ డైరెక్టర్ మామూలోడు కాదు

కేఆర్ సచ్చిదానందన్ అలియాస్ సాచి.. నిన్న కేరళలో గుండెపోటుతో మరణించిన దర్శకుడు. ఆయన వయసు 48 సంవత్సరాలే. ప్రస్తుతం మలయాళంలో టాప్ మోస్ట్ డైరెక్టర్లలో ఆయనొకడు. ఇంకా చెప్పాలంటే ఇండియా మొత్తంలో అత్యుత్తమ రైటర్ కమ్ డైరెక్టర్లలో సాచి ఒకడు అంటే అతిశయోక్తి కాదు. ఎవరైనా సినీ ప్రముఖులు పోయినపుడు వారు లేని లోటు తీర్చలేనిది అంటుంటారు. ఈ మాటకు నూటికి రెండొందల శాతం సరిపోయే వ్యక్తి సాచి.

లాక్ డౌన్ టైంలో దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులకు మంచి వినోదాన్నందించిన ‘అయ్యప్పనుం కోషీయుం’ సినిమాను రూపొందించింది ఈ దర్శకుడే. ఒక చిన్న పాయింట్ తీసుకుని.. మూడు గంటల పాటు కథనాన్ని నడిపించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. సినిమా అంతా చూశాక ఇలాంటి కథ ఎలా రాశాడు.. ఇంత బాగా ఎలా తీశాడు అని సందేహం కలుగుతుంది.

అహం అనేది మనుషుల్ని ఎంతటి తీవ్ర ఆలోచనలకు పురిగొల్పుతుంది.. ఎంతగా నష్టం చేస్తుందనే విషయం ఇంత ప్రభావవంతంగా చెప్పిన దర్శకుడు ఇంకెవ్వరూ కనిపించరేమో. దర్శకుడిగా సాచికి ఇది రెండో సినిమా. ఈ సినిమాలో ఒక హీరోగా నటించిన పృథ్వీ రాజ్‌తో ‘అనార్కలి’ అనే సినిమా ద్వారా ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. అది కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది. పృథ్వీరాజ్‌ను చాలా డిఫరెంట్‌గా ప్రెజెంట్ చేశాడందులో.

ఇక దర్శకుడు కాకముందు సాచి పది సినిమాలకు పైగానే రచయితగా పని చేశాడు. అందులో చాలా వరకు మాస్టర్ పీస్‌లే. కొత్తదనం ఉంటూనే కమర్షియల్‌గానూ సక్సెస్ అయ్యేలా కథలు, స్క్రీన్ ప్లేలు రాయడంలో సాచి దిట్ట. ఒక సూపర్ స్టార్ హీరో.. అతడికి వీరాభిమాని అయిన ఓ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్.. వీళ్ల మధ్య అనుకోకుండా క్లాష్ వచ్చి ఆ హీరో మీదే అభిమాని తిరగబడే కథతో తెరకెక్కిన సినిమా ‘డ్రైవింగ్ లైసెన్స్’.

గత ఏడాది వచ్చిన ఈ సినిమా కూడా ఒక ట్రెండ్ సెట్టర్ అయింది. దానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించింది సాచినే. దర్శకుడిగా ఇప్పుడే ప్రయాణం ఆరంభించిన సాచి.. మున్ముందు ఇంకా మంచి మంచి సినిమాలు అందిస్తాడని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ‘అయ్యప్పనుం కోషీయుం’ తర్వాత ఆయనపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో సాచి అనారోగ్యంతో కన్నుమూయడం మలయాళ పరిశ్రమకే కాదు.. మొత్తంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి తీరని లోటే.