ప్రొడ్యూసర్‌‌గా కమల్ దూకుడు

మహానటుడు కమల్ హాసన్ ఏం చేసినా అది ప్రత్యేకంగానే ఉంటుంది. కమర్షియాలిటీని మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా  వెర్సటాలిటీకి కూడా పెద్ద పీట వేస్తారాయన. అందుకే ఇప్పటికీ ఆయన సినిమాలన్నా, ఆయన నటన అన్నా అంత క్రేజ్. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‌లో విక్రమ్ సినిమా చేస్తున్నారు కమల్. దీని తర్వాత ఇండియన్ 2ని కంప్లీట్ చేస్తారు. ఆపైన వెట్రిమారన్‌తో ఒక మూవీ చేయనున్నారు.      

అయితే నటుడిగానే కాక నిర్మాతగానూ యాక్టివ్‌గా ఉన్నారు కమల్. తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌‌పై పలు చిత్రాలు నిర్మిస్తూ వస్తున్నారు. విక్రమ్ చిత్రానికి ఆయనే నిర్మాత. ఇక శివ కార్తికేయన్ నెక్స్ట్ మూవీని కూడా కమలే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ విషయాన్ని సంక్రాంతి సందర్భంగా ఆయనే స్వయంగా అనౌన్స్ చేశారు. రాజ్‌కుమార్ పెరియస్వామి డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌తో కలిసి కమల్ నిర్మిస్తున్నారు.     

ఇక త్వరలో కమల్ ఒక ఆంథాలజీని కూడా తీయనున్నట్లు తెలుస్తోంది. అది కూడా మలయాళంలో. ఎం.టి.వాసుదేవన్ నాయర్ రాసిన ఆరు షార్ట్ స్టోరీస్‌ ఆధారంగా ఈ ఆంథాలజీ ఉంటుందట. ఆరు భాగాలనూ ఆరుగురు డైరెక్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ లిజో జోస్ పెల్లిసరీ, ప్రియదర్శన్, జయరాజ్, శ్రామ్ ప్రసాద్, సంతోష్ శివన్, సంతోష్ నారాయణన్‌లకు బాధ్యత అప్పగించారని సమాచారం. స్క్రిప్ట్ వర్క్ మొత్తం కమల్ హాసనే చేస్తున్నారట.        

ఇక వీటిలో నటించేందుకు ఇప్పటికే మోహన్‌ లాల్, మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో పాటు వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్‌ని కూడా ఫిక్స్ చేసినట్లు టాక్. ఇతర కాస్ట్ అండ్ క్రూ సెలెక్షన్స్ జరుగుతున్నాయట. మలయాళంలోనే తెరకెక్కినా.. మిగతా భాషల్లోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేసే ప్లాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి  నటుడిగానే కాక నిర్మాతగానూ దూకుడు చూపిస్తున్నారుడు కమల్.