మరో లెజెండ్ బయోపిక్‌

కొంతకాలంగా బయోపిక్స్‌కి కేరాఫ్‌గా మారిపోయింది బాలీవుడ్. మిగతా భాషల వారు కూడా ఫేమస్ వ్యక్తుల జీవితాలను తెరకెక్కిస్తున్నా.. హిందీలో వచ్చినన్ని అయితే ఇంకెక్కడా రావడం లేదు. ఇప్పుడు మరో లెజెండ్ జీవితం కూడా సెల్యూలాయిడ్‌ పైకి చేరుతోంది. ఆయన ఎవరో కాదు.. అలనాటి రొమాంటిక్ హీరో రాజేష్‌ ఖన్నా.     

ఆరాధన, ఆనంద్, కటీ పతంగ్, అమర్‌‌ ప్రేమ్, ఖామోషీ లాంటి చిత్రాలతో బాలీవుడ్‌ని యేళ్లపాటు ఏలారు రాజేష్ ఖన్నా. ఆయన సినిమాలు.. వాటిలోని పాటలు.. అజరామరం. ఆయన పర్సనల్‌ లైఫ్‌లోనూ ఎన్నో సంచలనాలు ఉన్నాయి. నటి అంజు మహేంద్రుతో ఏడేళ్ల రిలేషన్, బ్రేకప్‌.. డింపుల్‌ కపాడియాతో పెళ్లి, పిల్లలు, విడిపోవడం.. ఆ తర్వాత టీనా మునిమ్‌తో ప్రేమలో పడ్డాడనే వివాదాలు.. వచ్చాయి.

ఆపైన కొన్నాళ్లకు మళ్లీ అంజు మహేంద్రుతో రిలేషన్‌ రీస్టార్ట్ చేయడం.. తన జీవితంలో ఇంతమంది ఉన్నా ఏదో తెలియని ఒంటరితనంతో బాధపడటం.. చివరికి క్యాన్సర్‌‌తో చనిపోవడం.. చెప్పుకోవడానికి, సినిమాగా తీయడానికి చాలానే ఉంది ఆయన జీవితంలో.  అందుకే రాజేష్ ఖన్నా లైఫ్‌పై చాలా పుస్తకాలు కూడా వచ్చాయి. వాటిలో గౌతమ్ చింతామణి రాసిన ‘డార్క్ స్టార్‌‌: ద లోన్‌లీనెస్‌ ఆఫ్ బీయింగ్ రాజేష్‌ ఖన్నా’ అనే పుస్తకం చాలా ఫేమస్. ఇది చదివిన నిర్మాత నిఖిల్ అద్వానీ వెంటనే ఖన్నా బయోపిక్ తీయాలని డిసైడయ్యారు. పుస్తక రచయిత గౌతమ్ ఆల్రెడీ స్క్నీన్‌ ప్లే రాయడంలో బిజీగా ఉన్నారు. దర్శకత్వ బాధ్యతను ఫరాఖాన్ చేతిలో పెట్టారు.        

బేసిగ్గా కొరియోగ్రాఫరే అయినా డైరెక్టర్‌‌గానూ సత్తా చూపింది ఫరా ఖాన్. మై హూ నా, ఓం శాంతి ఓం లాంటి భారీ హిట్లు ఉన్నాయి ఆమె ఖాతాలో. ఎమోషనల్‌ కంటెంట్‌ని డ్రైవ్ చేయడంలో ఫరా స్టైలే వేరు. అందుకే ఖన్నా జీవితాన్ని తెరకెక్కించడానికి ఆమె అయితేనే కరెక్టని నిర్మాత నమ్ముతున్నారు. అయితే ఖన్నా జీవితంలోని డార్క్ సైడ్‌ని సిన్సియర్‌‌గా చూపిస్తారా లేక చాలామంది బయోపిక్స్‌లో వాస్తవాలను దాచిపెట్టి పాలిష్డ్‌గా ప్రెజెంట్ చేసినట్టే దీన్నీ చేస్తారా అనేది ప్రస్తుతానికి జవాబు తెలియని ప్రశ్న.