సంక్రాంతి రేసులో ‘డీజే టిల్లు’!

,2022 సంక్రాంతికి రావడానికి పాన్ ఇండియా సినిమాలు రెడీ అవుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ లాంటి సినిమాలు బరిలో ఉండడంతో మిగిలిన సినిమాలు తమ రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకున్నారు. సంక్రాంతికి రావాలనుకున్న పవన్ కళ్యాణ్ ‘భీమ్లానాయక్’ సినిమాను బలవంతంగా వాయిదా వేయించారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ విడుదలవుతాయా..? లేదా..? అనే సందేహాలు కలుగుతున్నాయి. 

దానికి కారణం కరోనా మహమ్మారి. చాలా రాష్ట్రాల్లో కరోనా మూడో దశ ప్రభావం చూపిస్తోంది. ముంబై లాంటి సిటీల్లో ప్రభుత్వం కర్ఫ్యూలు కూడా విధించింది. థియేటర్లలో యాభై శాతం ఆక్యుపెన్సీ విధించారు. తమిళనాడు, కర్ణాటక కూడా ఇదే రూట్ ను ఫాలో అవుతాయని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నిర్మాతల్లో టెన్షన్ నెలకొంది. 

ఇదిలా ఉండగా.. ఇప్పడు సంక్రాంతి బరిలోకి ‘డీజే టిల్లు’ సినిమా దిగుతోందని సమాచారం. యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన ఈ రొమాంటిక్ డ్రామాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై  సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను ఇప్పటికే విడుదల చేశారు. 

ఇప్పుడు సినిమాను సంక్రాంతి బరిలో దింపాలని చూస్తున్నారు. యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమాను నిర్మించారు. సినిమాలో బోల్డ్ సీన్స్ చాలానే ఉన్నాయి. పాన్ ఇండియా సినిమాలతో పోటీగా ఇప్పుడు సడెన్ గా ఓ చిన్న సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకోవడం ఆశ్చర్యంగా ఉంది. దీంతో పాటు నాగార్జున నటించిన ‘బంగార్రాజు’ కూడా సంక్రాంతికి విడుదల కాబోతుంది.