Movie Ticket: మధ్యలో ప్రభుత్వ పెత్తనమేంటి?

అడుసు తొక్కనేల కాలు కడగనేల అనే సామెత తెలుగులో చాలా  పాపులర్. మరి ఈ సామెత ప్రభుత్వానికి సారధ్యంవహిస్తున్న జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదో అర్ధం కావటంలేదు. తాజాగా సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. సినిమా టికెట్ల ధరలను తగ్గించే అధికారం ప్రభుత్వానికి లేదంటు థియేటర్ల యజమానులు కోర్టులో కేసు వేశారు. ఈ కేసును విచారించిన కోర్టు థియేటర్ల యాజమాన్యాల వాదనతో ఏకీభవించింది.

ప్రభుత్వం జారీచేసిన జీవో నెంబర్ 35ని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్పింది. కోర్టు ఆదేశాల కారణంగా థియేటర్లలో పాత రేట్లే అమల్లోకి వచ్చినట్లయ్యింది. ఇక్కడ విషయం ఏమిటంటే సినిమా టికెట్లను ఆన్ లైన్లో అమ్మాలన్న ప్రభుత్వ నిర్ణయానికి టాలివుడ్ ప్రముఖులు సానుకూలంగా స్పందించారు. అయితే థియేటర్ల టికెట్ల ధరలను నియంత్రించటాన్ని మాత్రం వ్యతిరేకించారు. థియేటర్లలో టికెట్ల ధరలను నియంత్రించే విషయంలో ప్రభుత్వ జోక్యం వద్దని కొందరు సినిమా ప్రముఖులు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

సినిమాటోగ్రఫీ చట్టంలో థియేటర్లలో టికెట్ ధరలు ఇంతే ఉండాలని ప్రభుత్వం నియంత్రించాలని ఎక్కడా లేదు. అలాగే టికెట్ల ధరలు ఎంతుండాలనే విషయం పూర్తిగా  థియేటర్ల యాజమాన్యాల ఇష్టమే. ఎందుకంటే ఒక్కో యజమాని తన అభిరుచికి తగ్గట్లుగా థియేటర్లను నిర్మించుకుంటారు. పూర్తిగా ఏసీ సౌకర్యం, మంచి పుష్ బ్యాక్ సీట్లు, అత్యంతాధునిక సౌండ్ సిస్టం లాంటివి ఏర్పాట్లు చేయాలంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిందే.

ఇంత భారీ ఎత్తున ఖర్చుచేసిన తర్వాత పలానా సినిమా టికెట్ ధర 5 రూపాయలే ఉండాలని, 10 రూపాయలకు మించకూడదని ప్రభుత్వం నిబంధనలు విధిస్తే యజమానికి తన పెట్టుబడి ఎప్పటికి తిరిగొస్తుంది ? పైగా థియేటర్ యజమాని నిర్ణయించిన ధరకు ఇష్టమున్న వాళ్ళు టికెట్లు కొనుక్కుంటారు లేని వాళ్ళు లేరు. మధ్యలో ప్రభుత్వ పెత్తనం ఏమిటో అర్ధంకాలేదు. సో ఫైనల్ గా థియేటర్ల యాజమాన్యాల వాదనతోనే కోర్టు ఏకీభవించి ప్రభుత్వ జీవోను కొట్టేసింది. ఇదనే కాదు ఇలాంటి చాలా నిర్ణయాలను కోర్టు కొట్టేసింది. అందుకనే ఉత్తర్వులు ఇచ్చేముందే తన పరిధి ఏమిటో ప్రభుత్వం తెలుసుకుంటే బాగుంటుంది.