పునీత్ ఫ్యామిలీని ఇప్పుడు కలవను: AA

కరోనా టైంలో సినీ పరిశ్రమ ఎన్నో విషాదాలను చూసింది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా ఎందరో దిగ్గజాలు ఈ లోకాన్ని విడిచిపోయారు. అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తారు. కరోనాతో సంబంధం లేకుండా కూడా ఎంతోమంది ప్రముఖులు హఠాత్తుగా తుది శ్వాస విడిచారు. అందులో ఇటీవల అత్యంత బాధ పెట్టిన మరణాల్లో పునీత్ రాజ్‌కుమార్‌ది ఒకటి. అజాత శత్రువుగా పేరున్న పునీత్.. తండ్రి ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ హీరోగా మంచి స్థాయిని అందుకున్నాడు.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే అతడి వ్యక్తిత్వం.. ఎవ్వరూ ఊహించని స్థాయిలో అతను చేపడుతున్న సేవా కార్యక్రమాలు తన మీద అందరిలోనూ మంచి అభిప్రాయాన్ని కలిగించాయి. పునీత్ చనిపోయి నెలన్నర దాటుతున్నా ఇంకా అతడి మరణం తాలూకు బాధ నుంచి అభిమానులు బయటికి రాలేకపోతున్నారు. ఇప్పటికీ అతడి సమాధి సందర్శనకు వేల మంది రోజూ వస్తుండటం తనపై ఉన్న ప్రేమకు నిదర్శనం.పునీత్ మరణించిన సమయంలో, ఆ తర్వాత తెలుగు సినీ తారలు అతడి పట్ల చూపిస్తున్న అభిమానం కన్నడిగులను అమితంగా ఆకట్టుకుంటోంది.

చిరంజీవి సహా పలువురు తెలుగు సినీ ప్రముఖులు పునీత్ చివరి చూపు కోసం వెళ్లారు. ఆ తర్వాత కూడా అతడి కుటుంబాన్ని ఒక్కొక్కరుగా సందర్శిస్తున్నారు. ఇటీవలే రామ్ చరణ్ సైతం పునీత్ కుటుంబాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. తన కొత్త చిత్రం ‘పుష్ప’ ప్రమోషన్ల కోసం బెంగళూరుకు అల్లు అర్జున్ వెళ్లడంతో పునీత్ కుటుంబాన్ని సందర్శిస్తాడని అనుకున్నారు. కానీ అతను అక్కడికి వెళ్లలేదు. ‘పుష్ప’ ప్రెస్ మీట్లో పునీత్ గురించి మాట్లాడుతూ.. తాను ఈ సమయంలో పునీత్ కుటుంబాన్ని కలవనని కూడా బన్నీ చెప్పడం గమనార్హం.

ఇప్పుడు పునీత్ కుటుంబాన్ని సందర్శిస్తే సినిమా ప్రమోషన్ కోసం వెళ్లి అతడి ఫ్యామిలీని కలిసినట్లు అవుతుందని.. అందుకే ఇప్పుడు అక్కడికి వెళ్లనని బన్నీ స్పష్టం చేశాడు. పునీత్ మరణం తననెంతో కలచి వేసిందని.. తన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని.. ‘పుష్ప’ పనుల్లో బిజీగా ఉండటం వల్లే ఇప్పటిదాకా బెంగళూరుకు రాలేకపోయానని.. సినిమా పనిలో భాగంగా ఇక్కడికి వచ్చి తన కుటుంబాన్ని కలవడం బాగోదని.. అందుకే తర్వాత వేరుగా వచ్చి అతడి కుటుంబాన్ని కలుస్తానని బన్నీ వెల్లడించాడు.