మోహ‌న్ బాబు మంచోడే కానీ..

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ఓటమి అనంతరం తర్వాతి రోజే మీడియా ముందుకొచ్చి ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ప్రకాష్ రాజ్. ఆయన తీరు చూస్తే ఎన్నికల్లో ఓటమి పట్ల బాగా హర్టయ్యారని, ఇక ‘మా’ వ్యవహారాలకు పూర్తిగా దూరమైపోతారని అనిపించింది. కానీ తర్వాతి రోజే వచ్చి ఆయన కొత్త ట్విస్టు ఇచ్చారు.

తన ప్యానెల్ నుంచి గెలిచిన అభ్యర్థులందరితోనూ రాజీనామాలు చేయించారు. ఒక కండిషన్ మీద తాను ‘మా’ సభ్యత్వానికి ఇచ్చిన రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వచ్చే రెండేళ్లు వాచ్ డాగ్ లాగా మారి ‘మా’లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించనున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశం తర్వాత కూడా ప్రకాష్ రాజ్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ‘మా’ ఎన్నికల రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలని ప్రకాష్ రాజ్ అడగడంపై జరుగుతున్న చర్చ గురించి తెలిసిందే.

ఇక ప్రకాష్ రాజ్ తాజా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణతో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో ఎన్నికల గురించి చాలా విపులంగా మాట్లాడారు. ముఖ్యంగా అందులో మోహన్ బాబు గురించి ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు బేసిగ్గా మంచోడే అని.. ఆయనకు మంచి హాస్య చతురత ఉందని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. ఐతే మోహన్ బాబు జోలికి వెళ్లనంత వరకు బాగానే ఉంటుందని.. ఆయనతో కెలుక్కుంటే మాత్రం అంతే సంగతులని ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. తన వెనుక మనుషులు ఉంటే మోహన్ బాబు రెచ్చిపోతారని.. ఎవరూ లేకుంటే మాత్రం సైలెంటుగా ఉంటారని ప్రకాష్ రాజ్ అన్నారు.

‘మా’ ఎన్నికల రోజు మోహన్ బాబు పాదాలను తాకడం గురించి ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. మర్యాదపూర్వకంగా ఆ పని చేశానని, అదే సమయంలో ఎన్నికల సందర్భంగా జరుగుతున్న రగడ గురించి ప్రస్తావిస్తూ ఇదేంటని అడిగానని చెప్పారు.

‘మా’ క్రమశిక్షణ సంఘం సభ్యుడై ఉండి ఆయన బెనర్జీ, తనీష్ లాంటి వాళ్లతో చాలా దారుణంగా ప్రవర్తించారని.. అరగంటసేపు బూతులు తిట్టారని.. బెనర్జీని కొట్టబోయేరని.. ఇదేం సంస్కారం అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. మామూలు ఎన్నికల తరహాలో ‘మా’ ఎన్నికల్లో అక్రమాలు, ప్రలోభాలు చోటు చేసుకున్నాయని ప్రకాష్ రాజ్ అన్నారు. ఐతే ఎన్నికల్లో ఓడినప్పటికీ.. రాబోయే రెండేళ్లు మంచు విష్ణు, అతడి ప్యానెల్‌ను నిద్ర పోనివ్వనని.. ప్రతి నెలా రిపోర్ట్ కార్డ్ అడుగుతానని ప్రకాష్ రాజ్ స్పష్టం చేశారు.