పవన్, నేను మాట్లాడుకున్నాం-మంచు విష్ణు

దసరా టైంలో భాజపా సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం ‘అలయ్ భలయ్’కి ఈసారి జనసేనాని పవన్ కళ్యాణ్, కొత్తగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణులను ఆహ్వానించడం.. వాళ్లిద్దరూ ఈ వేడుకలో పాల్గొనడం తెలిసిందే. ఐతే ఈ వేడుకలో పక్క పక్కనే కూర్చున్న పవన్, మంచు విష్ణు ఎడమొహం పెడమొహంగా కనిపించడం.. ఇద్దరూ మాట్లాడుకోలేదన్న వార్తలు రావడం చర్చనీయాంశం అయింది.

‘మా’ ఎన్నికల గొడవ నేపథ్యంలోనే విష్ణుతో పవన్ మాట్లాడలేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఐతే దీనిపై మంచు విష్ణు స్పందించాడు. ‘మా’ అధ్యక్షుడిగా గెలిచిన నేపథ్యంలో కుటుంబంతో కలిసి సోమవారం విష్ణు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం బయట విలేకరులతో మాట్లాడాడు. అలాగే తర్వాత తమ విద్యా నికేతన్ కళాశాలలో ప్రెస్ మీట్లోనూ పాల్గొన్నాడు.

ఈ సందర్భంగా విష్ణు.. వివిధ అంశాలపై మాట్లాడాడు. ఈ సందర్భంగా ‘అలయ్ భలయ్’ కార్యక్రమం ప్రస్తావన కూడా వచ్చింది. దీనిపై విష్ణు స్పందిస్తూ.. ఆ కార్యక్రమంలో తాను, పవన్ మాట్లాడుకున్నామని చెప్పాడు. తమ మధ్య గ్యాప్ ఉందన్నది అబద్ధమన్నాడు. తాను ఆయన్ని పట్టించుకోలేదన్నది వాస్తవం కాదన్నాడు విష్ణు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో అక్కడ మంచి కార్యక్రమం జరగిందని విష్ణు చెప్పాడు. ఇక ‘మా’ ఎన్నికల రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలని ప్రకాష్ రాజ్ కోరడంపై విష్ణు స్పందిస్తూ.. ‘‘ఎన్నికల్లో గెలుపోటములు సర్వ సాధారణం. ప్రకాష్ రాజ్ సీసీటీవీ ఫుటేజ్ చక్కగా చూసుకోవచ్చు.

అన్నీ బహిరంగంగానే జరిగాయి. పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయకముందే నేను గెలిచానని ప్రకాష్ రాజ్ చెప్పుకున్నారు’’ అని విష్ణు వ్యాఖ్యానించాడు. ఇక ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాలు చేయడం గురించి విష్ణు స్పందిస్తూ.. ఆ రాజీనామాల గురించి మీడియాలో చూడటమే తప్ప, సంబంధిత పత్రాలు తనకింకా అందలేదని, అవి అందాక దాని గురించి మాట్లాడతానని అన్నాడు.