మా ఎలక్షన్స్‌: జీవితనే ఎందుకు టార్గెట్ చేస్తున్నట్టు?

‘మా’ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్ 10న తలపడేందుకు మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ సిద్ధంగా ఉన్నాయి. ఆ క్రమంలో ఒకరి మీద ఒకరు చేసుకుంటున్న విమర్శలు పీక్స్కి వెళ్తున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, వీకే నరేష్‌లు ఆల్రెడీ ప్రెస్‌మీట్‌లు పెట్టి విమర్శనాస్త్రాల్ని సంధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జీవితా రాజశేఖర్‌‌ కూడా ముందుకొచ్చి మాటల యుద్ధానికి దిగారు. ఏ ప్యానెల్‌లో ఉండాలనేది తన ఇష్టమని, తననే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు.

“బండ్ల గణేష్‌ నా గురించి కామెంట్ చేశారు. పృథ్వీ కూడా నాపై ఈసీకి కంప్లయింట్ చేశారు. మంచి చేయడమే మా తప్పా? ఎందుకిలా టార్గెట్ చేస్తున్నారు? గతంలో నరేష్‌ చెప్పారని ఎన్నికల్లో పాల్గొన్నాం. ఆయనకు సపోర్ట్ చేశాం. ఆయనేమో ఎవరినీ కలుపుకుని పోయేవారు కాదు. అందుకే ఇన్ని సమస్యలు వచ్చాయి. జరిగిన రెండు మూడు మీటింగుల్లోనూ కొట్టుకోవడమే. ఎలక్షన్స్‌లో గెలిచాక ఫారిన్ ప్రోగ్రామ్ చేసినవారితోనే మళ్లీ కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారు. వాళ్లలో ఒకరైతే అమెరికాలో ప్రోగ్రామ్ చేస్తే కోటి రూపాయలు ఇస్తామన్నారు. దీనికి మా ప్యానెల్ సభ్యులంతా అభ్యంతరం చెప్పాం. దాంతో మా మధ్య గొడవలు మొదలయ్యాయి. మేమేం చెప్పినా తప్పుగానే తీసుకునేవారు. ఇప్పుడు కూడా అందుకే విమర్శలు చేస్తున్నారు. నామీద వచ్చిన ఆరోపణల్ని నిజమని నిరూపించమనండి చూద్దాం.”

“విష్ణు అన్నా, మోహన్‌ బాబు గారన్నా నాకు గౌరవం. విష్ణుగారు తనంతట తానుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరి నరేష్‌ ఆయన వెంట ఎందుకు తిరుగుతున్నట్టు? ‘మా’లో ప్రాంతీయవాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌ ప్రెసిడెంటుగా ఉన్నవాళ్లంతా తెలుగువాళ్లు కాదు కదా? మరి ప్రకాష్ రాజ్ విషయంలోనే ఈ పాయింట్‌ని ఎందుకు తీసుకొస్తున్నారో నాకు తెలియడం లేదు.”

“రీసెంట్‌గా ఓ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ కలిశారు. ఓటు వేయమని అడిగితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే బాధగా ఉందని, తనని అడగొద్దని అన్నారు. అది నిజం. ఇప్పుడు పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది’ అంటూ ఆవేశంగా మాట్లాడారు జీవిత. చివర్లో పోసాని టాపిక్‌ని కూడా టచ్ చేశారు. ఆయన అంత దారుణంగా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. తమ ప్యానెల్ గెలిస్తే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని హామీ కూడా ఇచ్చారు.”