పవన్ స్పీచ్ పై నాని రియాక్షన్..!

హీరో సాయి ధరమ్ తేజ్, దేవకట్టా కాంబినేషన్ లో తెరకెక్కిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేసింది. తాజాగా ఏర్పాటు చేసిన సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన స్పీచ్ హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ అంశాలతో పాటు.. సినీ పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి కూడా ఆయన మాట్లాడారు. ఏపీలో టికెట్స్ ప్రభుత్వమే అమ్ముతుందనే విషయంపై పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు.

ఇండస్ట్రీకి చెందిన పెద్దలు ధైర్యంగా ఏపీ ప్రభుత్వంలో మాట్లాడాలని సూచించారు. పవన్ తన స్పీచ్ లో ప్రభాస్, రానా, ఎన్టీఆర్, రామ్ చరణ్, మోహన్ బాబు, చిరంజీవి ఇలా అందరి హీరోల గురించి మాట్లాడారు. అందరూ ఒక్క మాటపై నిలబడాలని.. ప్రశ్నించడం మన హక్కు అని ప్రోత్సహించారు. ఇదే సమయంలో హీరో నాని గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. కొన్నిరోజుల క్రితం నాని థియేటర్ల గురించి మాట్లాడితే.. అందరూ ఆ అబ్బాయ్ ని టార్గెట్ చేశారని.. పాపం తనేం చేస్తాడు.. దమ్ముంటే వైసీపీ ప్రభుత్వాన్ని వెళ్లి అడగమంటూ చురకలు అంటించారు పవన్.

తాజాగా పవన్ కళ్యాణ్ స్పీచ్ పై నాని స్పందించారు. ఏపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సర్ కి ఉన్న పొలిటికల్ డిఫరెన్సెస్ పక్కన పెడితే.. సినీ పరిశ్రమ గురించి ఆయన జెన్యూన్ గా మాట్లాడారని.. అందరూ దానిపై దృష్టి పెట్టాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు నాని. అలానే.. సినిమా సభ్యుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని. సంబంధిత మంత్రులను సినీ పరిశ్రమను కాపాడమని కోరుతున్నట్లు నాని తన ట్వీట్ లో పేర్కొన్నారు. నాని వేసిన ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.