పూరి కోసం వెయిటింగ్‌-మ‌హేష్‌

మ‌హేష్ బాబు అభిమానులు త‌మ హీరో సినిమా చేయాల‌ని ఎంత‌గానో ఆశించే ద‌ర్శ‌కుల్లో పూరి జ‌గ‌న్నాథ్ ఒక‌డు. మ‌హేష్‌ను నెవ‌ర్ బిఫోర్ అవ‌తార్‌లో ప్రెజెంట్ చేస్తూ పూరి తీసిన పోకిరి ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో తెలిసిందే. ఆ సినిమాతో ఇండ‌స్ట్రీ హిట్ కొట్టాడు మ‌హేష్‌. ఆ త‌ర్వాత వీళ్ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన బిజినెస్‌మేన్ కూడా మంచి విజ‌య‌మే సాధించింది. మ‌హేష్‌ను అంత‌టి అగ్రెసివ్ క్యారెక్ట‌ర్ల‌లో చూపించ‌డం పూరీకి మాత్ర‌మే చెల్లింది.

మ‌ళ్లీ వీళ్ల క‌ల‌యిక‌లో ఓ ప‌వ‌ర్ ఫుల్ మూవీ వ‌స్తే చూడాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. ఐతే బిజినెస్‌మేన్‌-2 అని, జ‌న‌గ‌ణ‌మ‌న అని వీళ్ల మూడో సినిమా గురించి కొన్ని క‌బుర్లు వినిపించాయి కానీ.. అవి కార్య‌రూపం దాల్చ‌లేదు. మ‌ధ్య‌లో వీళ్లిద్ద‌రి మ‌ధ్య అనుకోకుండా కొంచెం గ్యాప్ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో మ‌హేష్‌, పూరి క‌లిసి మ‌ళ్లీ సినిమా చేయ‌డం సందేహంగా మారింది. ఇందుకు మ‌హేషే సుముఖంగా లేడ‌న్న సంకేతాలు క‌నిపించాయి. ఐతే ఆదివారం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో ముచ్చ‌టించిన మ‌హేష్‌.. పూరితో మ‌ళ్లీ ప‌ని చేసే విష‌యంలో త‌న‌కెలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని చెప్పాడు సూప‌ర్ స్టార్.

పూరితో మ‌ళ్లీ సినిమా చేస్తే చూడాల‌నుంద‌ని ఓ అభిమాని అడిగితే.. ఆయ‌న త‌న ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌డ‌ని.. త‌న‌తో ప‌ని చేయ‌డాన్ని ఎంతో ఇష్ట‌ప‌డ‌తాన‌ని.. ఇప్ప‌టికీ ఆయ‌న వ‌చ్చి క‌థ చెబితే విన‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని అన్నాడు మ‌హేష్‌.

ఈ రోజు ఉద‌యం మ‌హేష్ కొత్త సినిమా స‌ర్కారు వారి పాట ప్రి లుక్ పోస్ట‌ర్ మీద పూరి చాలా పాజిటివ్‌గా స్పందించ‌డం, సాయంత్రానికి మ‌హేష్ ఆయ‌న‌తో సినిమా చేయ‌డానికి రెడీ అని ప్ర‌క‌టించ‌డంతో మ‌ళ్లీ వీళ్లిద్ద‌రూ క‌లిసి సినిమా చేస్తార‌న్న ఆశ అభిమానుల్లో పెరుగుతోంది.