తేజు లేకపోతేనేం.. మెగా ఫ్యామిలీ ఉందిగా


మెగా కుర్రాడు సాయిధరమ్ తేజ్.. తన కొత్త చిత్రం ‘రిపబ్లిక్’ రిలీజ్‌కు రెడీ అవుతున్న సమయంలో అనూహ్యంగా రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలయ్యాడు. ప్రమాదం జరిగి పది రోజులు దాటుతున్నా ఇంకా అతను ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఇంకొన్ని రోజుల్లో అతను డిశ్చార్జ్ అయినా కొంత కాలం ఇంటిపట్టునే ఉండి విశ్రాంతి తీసుకోక తప్పదు. దీంతో అక్టోబరు 1న రిలీజ్ కానున్న తేజు కొత్త సినిమా ‘రిపబ్లిక్’ ప్రమోషన్లు ఎలా అన్న సందేహాలు కలిగాయి.

ఒక దశలో తేజు పరిస్థితి చూసి సినిమా వాయిదా వేస్తారేమో అన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అలాంటి ఆలోచనేమీ చేయకుండా సెన్సార్ పూర్తి చేయించి అక్టోబరు 1కే సినిమాను ఖాయం చేశారు. మరి ప్రమోషన్ల మాటేంటి అన్న ప్రశ్న తలెత్తింది. అయితే ఇందుకు తేజు లేకపోతేనేం మెగా ఫ్యామిలీ ఉంది కదా అన్నది ఇప్పుడు వినిపిస్తున్న సమాధానం.

తేజు సినిమాను ప్రమోట్ చేసే బాధ్యత మెగా ఫ్యామిలీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా ఇందుకోసం చిరు ముద్దుల మేనమామ, మెగాస్టార్ చిరంజీవే రంగంలోకి దిగుతున్నాడు. బుధవారం ఉదయం 10 గంటలకు చిరు చేతుల మీదుగానే ‘రిపబ్లిక్’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కానుంది. #megastarforsdt అని హ్యాష్ ట్యాగ్ పెట్టి ఈ విషయాన్ని ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ద్వారా రివీల్ చేశారు. తర్వాత జరిగే ప్రమోషన్లలో మరికొందరు మెగా హీరోలు పాలుపంచుకోనున్నట్లు తెలుస్తోంది.

ప్రి రిలీజ్ ఈవెంట్‌కు రామ్ చరణ్‌తో పాటు కొందరు మెగా హీరోలు ముఖ్య అతిథులుగా హాజరవుతారని.. సోషల్ మీడియాలో దాదాపు అందరు మెగా హీరోలూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తారని అంటున్నారు. తేజుకు ప్రమాదం జరిగినపుడు మెగా ఫ్యామిలీలో అందరూ ఎంత చురుగ్గా వ్యవహరించారో తెలిసిందే. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సహా అందరూ వెంటనే స్పందించారు. ఇప్పుడు తేజు సినిమా కోసం కూడా మెగా ఫ్యామిలీ అండగా నిలవబోతోంది.