చరణ్ కోసం ట్రెండ్ సెట్ట‌ర్స్‌ని తీసుకొచ్చారు


మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సినిమా ముహూర్తానికి రంగం సిద్ధమైంది. శంకర్ దర్శకత్వంలో చరణ్ నటించబోతున్న కొత్త సినిమా బుధవారమే ప్రారంభోత్సవం జరుపుకోనున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం పట్టాలెక్కడానికి ముందే ఒక ఫొటో షూట్ కూడా చేశాడు శంకర్. ప్రారంభోత్సవానికి ముందు రోజే ఈ షూట్ చేయడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్‌లో చాలా పెద్ద స్థాయిలో ఈ ఫొటో షూట్ చేశారు.

ఇందులో హీరో హీరోయిన్లు రామ్ చరణ్, కియారా అద్వానీ పాల్గొన్నారు. ఈ షూట్‌తో పాటు ముహూర్త వేడుకలో పాల్గొనడం కోసం కియారా ముంబయి నుంచి దిగింది. ఇక శంకర్ ఏం చేసినా ఒక రేంజిలో ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ ఫొటో షూట్ కూడా అంతే. రెగ్యులర్ కెమెరామన్లతో కాకుండా స్పెషల్ టెక్నీషియన్ల‌తో ఈ షూట్ చేయించాడు శంకర్. వారి పేర్లు.. రాజీవ్ చుదాసమా, అవినాష్ గోవారిక‌ర్..ఫిలిం ఫొటో షూట్లలో ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన వ్యక్తులు వీళ్లు.

మార్చింగ్ యాంట్స్ పేరుతో 13 ఏళ్ల కిందట ఓ సంస్థను నెలకొల్పి మోడలింగ్, ఫిలిం ఫొటోగ్రఫీని కొత్త పుంతలు తొక్కించాడు రాజీవ్. అవినాష్ గోవారిక‌ర్‌కు ఫొటోగ్రాఫ‌ర్‌గా గొప్ప పేరే ఉంది. మ‌న మ‌హేష్ బాబు త‌ర‌చుగా అవినాష్‌తో ఫొటో షూట్లు చేయించుకుంటాడు. ఈ మ‌ధ్య కూడా అవినాష్ చేసిన ఒక ఫొటో షూట్లో మ‌హేష్ హాలీవుడ్ హీరోలాగా క‌నిపించాడు. రాజీవ్ సంస్థ ఇప్పటిదాకా సినిమాలతో పాటు వివిధ రకాలైన 2500 పోస్టర్లు డిజైన్ చేయడం విశేషం. బాలీవుడ్లో ఎన్నో భారీ చిత్రాలకు పోస్టర్ డిజైన్ చేసిన ఘనత అతడిదే.

సౌత్‌లో పెద్దగా పని చేయని రాజీవ్‌ను చరణ్ సినిమా కోసం శంకర్ తీసుకొచ్చాడు. ఫొటో షూట్లు, డిజైనింగ్ కోసం కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ రాజీవ్‌, అవినాష్‌. ఔట్ పుట్ కూడా ఆ రేంజిలోనే ఇస్తారు. కాబట్టి శంకర్-చరణ్ సినిమా ఫొటో షూట్ విజువల్స్, పోస్టర్ల మీద భారీ అంచనాలే పెట్టుకోవచ్చు. అగ్ర నిర్మాత దిల్ రాజు దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్లో ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో నిర్మించబోతున్నాడు. తమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చబోతున్న సంగతి తెలిసిందే.