టాలీవుడ్ ఆ దర్శకుణ్ని కట్టేసుకున్నట్లే

ప్రశాంత్ నీల్.. రెండేళ్ల కిందట ‘కేజీఎఫ్’ సినిమాతో భారతీయ ప్రేక్షకుల దృష్టిని అమితంగా ఆకర్షించిన దర్శకుడు. అన్ని ఇండస్ట్రీల వాళ్లూ ఈ దర్శకుడి ప్రతిభ గురించి మాట్లాడుకున్నారు. మనకు పరిచయం లేని హీరో సినిమా చూస్తూ.. ఇక్కడ పెద్ద స్టార్‌ను చూస్తున్న ఫీలింగ్ కలిగి రోమాలు నిక్కబొడుచుకుంటే ఆ దర్శకుడి పనితనం ఎలాంటిదో చెప్పేదేముంది? మనకు పరిచయం లేని హీరో సినిమాకే అలా ఉంటే.. మన దగ్గర బడా స్టార్లతో ప్రశాంత్ జట్టు కడితే ఎలా ఉంటుంది అన్న ఊహ చాలామందిలో కలిగింది. ఆ ఊహలు నిజం కావడానికి ఎంతో సమయం పట్టలేదు.

‘కేజీఎఫ్-2’ను పూర్తి చేసి ఇప్పటికే ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్న ప్రశాంత్.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా చేయడానికి కమిట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా ఇచ్చారు.

ఈ రెండు సినిమాలు పూర్తి చేయడానికి ప్రశాంత్‌కు దాదాపు రెండేళ్ల సమయం పట్టేలా ఉంది. ఐతే ఆ తర్వాత కూడా ప్రశాంత్ తన సొంత ఫిలిం ఇండస్ట్రీలో సినిమా చేయడం సందేహంగానే ఉంది. ప్రశాంత్‌తో పని చేయడానికి మిగతా టాలీవుడ్ స్టార్లు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఆల్రెడీ అల్లు అర్జున్.. అతడితో చర్చలు జరిపాడు.

రామ్ చరణ్ సైతం ప్రశాంత్ మీద ఓ కన్నేశాడని అంటున్నారు. ఇంకోవైపు ప్రభాస్‌తో ప్రశాంత్‌ ఇంకో సినిమా కూడా చేస్తాడంటున్నారు. మరోవైపు మహేష్ బాబు సైతం ప్రశాంత్‌తో సినిమా చేస్తే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. గతంలోనే ఈ కాంబినేషన్ గురించి చర్చ జరిగింది. ప్రశాంత్ సొంత ఇండస్ట్రీ అయిన శాండిల్‌వుడ్ రేంజ్ చాలా తక్కువ.

ఇండియాలో బాలీవుడ్ తర్వాత అత్యధిక పారితోషకాలు ఇవ్వడమే కాదు, ఎక్కువ రీచ్ ఉన్న ఇండస్ట్రీ టాలీవుడ్డే. కోలీవుడ్ సైతం గత కొన్నేళ్లలో జోరు తగ్గించేసింది. బాలీవుడ్‌కు వెళ్లి సినిమాలు చేయాలన్న ఆసక్తి ప్రశాంత్‌కు పెద్దగా ఉన్నట్లు లేదు. ఇక సౌత్‌లో ప్రస్తుతం ఏ రకంగా చూసినా నంబర్ వన్ ఇండస్ట్రీ అంటే టాలీవుడ్డే. కాబట్టి ఇక్కడ బడా స్టార్లతో సినిమాలు చేసుకుపోవడానికి ప్రశాంత్‌కు అభ్యంతరం ఏముంటుంది?