ఎన్టీఆర్ సరసన తొలిసారి ఆమె?

ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యింది. నెల ముందు వరకు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్‌తోనే అనుకుంటూ వచ్చారంతా. ఏడాది ముందే ఈ సినిమా గురించి ప్రకటన వచ్చింది. అప్పట్నుంచి సన్నాహాలు జరుగుతూనే ఉన్నాయి. తారక్ ‘ఆర్ఆర్ఆర్’ పని పూర్తి చేసి ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు ఈ సినిమా మొదలవుతుందని అనుకుంటూ వచ్చారు. కానీ ఉన్నట్లుండి కథ మారిపోయింది.

త్రివిక్రమ్‌తో తారక్ ప్రాజెక్టు క్యాన్సిల్ అయింది. ఆ స్థానంలోకి కొరటాల శివ ప్రాజెక్టు వచ్చింది. శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్ నిర్మాణంలో గత నెలలోనే ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ అని ఇప్పటికే ప్రకటించిన సంగతీ తెలిసిందే.

ప్రస్తుతం ‘ఆచార్య’ షూటింగ్‌కు కూడా బ్రేక్ పడటంతో కొరటాల.. తారక్ సినిమా స్క్రిప్ట్, ప్రి ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. పనిలో పనిగా ముఖ్య తారాగణం ఎంపిక మీదా దృష్టిపెట్టాడట. ఈ చిత్రానికి కథానాయికగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని ఖరారు చేశారన్నది తాజా సమాచారం.

కొరటాల చిత్రం ‘భరత్ అనే నేను’తోనే ఆమె తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ సినిమాతో ఆమెకు మంచి ఎంట్రీ కూడా లభించింది. ఐతే రెండో సినిమా ‘వినయ విధేయ రామ’ మాత్రం నిరాశ పరిచింది. ఆ తర్వాత ఆమె మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. కొన్ని ప్రాజెక్టుల్లో ఆమె పేరు వినిపించింది కానీ.. ఏదీ ఓకే కాలేదు.

ఐతే తారక్-కొరటాల చిత్రానికి మాత్రం ఆమె సంతకం చేసిందనే అంటున్నారు. తారక్‌తో కియారా జోడీ బాగుంటుందనే అనుకుంటున్నారు. ఈ సినిమాలో తారక్ స్టూడెంట్ లీడర్ పాత్ర చేయబోతున్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చే అవకాశముంది.