‘పుష్ప’ టీం అత్యాశ కొంపముంచదుగా..


‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నారన్న సమాచారం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. ఇది చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. సుకుమార్ ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడు అనే ప్రశ్నను కూడా రేకెత్తిస్తోంది. ఎందుకంటే ఇలా ఏ సినిమాను పడితే ఆ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తే బాగోదు. బాహుబలి, కేజీఎఫ్ లాంటి సినిమాల విషయంలో ఈ ఐడియా బాగానే వర్కవుట్ అయింది. నిజానికి ‘బాహుబలి’ని ఒక సినిమాగా తీద్దామని మొదలుపెట్టి.. మధ్యలో రెండు భాగాల ఆలోచన చేసినపుడు చాలామంది పెదవి విరిచారు. ఇదేం విడ్డూరం అన్నట్లుగా మాట్లాడారు.

కానీ ఆ కథను రెండుగా విభజించడంలో రాజమౌళి చూపిన ప్రతిభ అసామాన్యమైంది. ఆ కథలో ఆ స్పాన్ ఉందని జక్కన్న గుర్తించాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న దగ్గర సినిమాను ముగించాడు. బాహుబలి ఫ్లాష్ బ్యాక్‌ ప్రధానంగా రెండో భాగాన్ని నడిపించాడు. మొత్తంగా రెండు భాగాల ఐడియా అద్భుత ఫలితాన్నిచ్చింది. ఇక ‘కేజీఎఫ్’ విషయానికి వస్తే.. దాన్ని ముందు నుంచే రెండు భాగాలుగా తీయాలనుకున్నారు. ఆ ప్రకారమే కథను సిద్ధం చేసుకున్నాడు ప్రశాంత్ నీల్.

ఐతే ఈ రెండు సినిమాల రేంజ్ వేరు. వాటి కథలకు ఉన్న రీచ్ కూడా వేరు. విజువల్‌గా అవి మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. కానీ ‘పుష్ప’ అనేది మామూలు సినిమాలాగే కనిపిస్తోంది. బాహుబలి, కేజీఎఫ్ సినిమాల్లోని విజువల్ మెరుపులు ఇందులో ఉంటాయా, ఈ కథకు రెండు భాగాలుగా తీసేంత రీచ్ ఉంటుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగస్థలం, అల వైకుంఠపురములో లాంటి భారీ విజయాల తర్వాత సుకుమార్, అల్లు అర్జున్ కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనికి హైప్ బాగానే వచ్చింది. ఆ హైప్‌ను క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా.. రెండు భాగాలుగా సినిమా తీస్తే ఎక్కువ బిజినెస్ జరిగి ఎక్కువ ఆదాయం వస్తుందన్న అత్యాశతో ఈ నిర్ణయం తీసుకున్నారా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

నిజంగా కథ డిమాండ్ చేయడం వల్ల రెండు భాగాలుగా తీస్తే సమస్య లేదు. కానీ ‘పుష్ప’ను ఒక సినిమాగా మొదలుపెట్టి, సగం చిత్రీకరణ పూర్తిచేసి, రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసి, ఇంకో మూణ్నాలుగు నెలల్లో విడుదల అనుకుంటుండగా ఇప్పుడు ఇలా రెండు భాగాల ప్రతిపాదన తేవడంతోనే సందేహాలు ముసురుకుంటున్నాయి. అత్యాశతో ఈ సినిమాను చెడగొట్టుకుంటారా.. అసలుకే మోసం వస్తుందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.