దిల్ రాజు స్టేట్మెంట్.. మా తర్వాతి సినిమా ఐకానే


కొన్ని రోజుల కిందటే నిర్మాత దిల్ రాజు కరోనా బారిన పడ్డట్లు సమాచారం బయటికి వచ్చింది. అప్పట్నుంచి ఇంట్లోనూ ఉంటూ చికిత్స తీసుకుంటున్నారాయన. తాజాగా ఆయన వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా పరీక్షలో నెగెటివ్ కూడా వచ్చింది. దీంతో వెంటనే బయటికి వచ్చిన రాజు.. దర్శకుడు వేణు శ్రీరామ్‌తో కలిసి శనివారం ప్రెస్ మీట్ పెట్టడం విశేషం. ‘వకీల్ సాబ్’ సినిమా ప్రమోషన్లు మధ్యలో ఆగిపోయిన నేపథ్యంలో రాజు ఇలా మీడియా ముందుకు వచ్చినట్లున్నాడు.

పోటీలో వేరే పేరున్న సినిమాలేవీ లేకపోవడం.. ప్రస్తుతం థియేటర్లకు ‘వకీల్ సాబ్’ చిత్రమే ఆధారంగా మారిన నేపథ్యంలో సాధ్యమైనంతగా కలెక్షన్లు రాబట్టడానికి రాజు ఈ ప్రెస్ మీట్ పెట్టినట్లు తెలుస్తోంది. ‘వకీల్ సాబ్’ సాధించిన విజయం తనకు అత్యంత సంతృప్తిని ఇచ్చిందని.. కళ్యాణ్ అభిమానులు తీవ్ర భావోద్వేగంతో, కన్నీళ్లు పెట్టుకుంటూ ఈ సినిమా చూస్తున్నారని.. ఇంతకంటే తనకేం కావాలని రాజు వ్యాఖ్యానించాడు.

దేశంలో అన్ని చోట్లా ఎన్నికలు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ థియేటర్లపై 50 శాతం ఆక్యుపెన్సీ తరహా షరతులు విధించే అవకాశాలున్నాయని రాజు అభిప్రాయపడ్డాడు. ఐతే కరోనా పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ సినిమాలు నడవాల్సిందే అని.. దాని మీద ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని రాజు అన్నాడు. కొత్త సినిమాల విడుదల ఆగకూడదని అభిప్రాయపడ్డాడు.

అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ సంస్థలో తెరకెక్కాల్సిన ‘ఐకాన్’ గురించి రాజు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ సినిమాకు స్క్రిప్టు ఎప్పుడో పూర్తయిందని.. అది తన మనసుకు బాగా నచ్చిన కథ అని రాజు అన్నాడు. ఐతే రకరకాల కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమైందని.. కానీ త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నామని రాజు తెలిపాడు. తమ సంస్థలో ఇమ్మీడియట్ ప్రాజెక్టు ఇదే అని రాజు స్పష్టం చేయడం విశేషం. ‘వకీల్ సాబ్’ విజయం నేపథ్యంలో వేణుతో ‘ఐకాన్’ చేయడానికి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే ఉంది రాజు మాటల్ని బట్టి చూస్తుంటే.