తెలుగు లొకేషన్లకు మణిరత్నం ఫిదా

పొరుగింటి పుల్లకూర రుచి అనే సామెత చందంగా.. మన దగ్గర షూటింగ్ చేసుకోవడానికి మంచి మంచి లొకేషన్లు ఎన్నో ఉన్నప్పటికీ.. మన ఫిలిం మేకర్స్ వేరే రాష్ట్రాలు, దేశాల వైపే చూస్తుంటారు. వేరే ప్రాంతాల లొకేషన్లు నచ్చడానికి తోడు అక్కడికి వెళ్లడానికి ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది. మన దగ్గర సినిమా షూటింగ్ అంటే జనాలు ఎలా ఎగబడతారో తెలిసిందే. ప్రశాంతంగా షూటింగ్ చేసుకోవడం కష్టం. అందుకే మన స్టార్లు, టెక్నీషియన్ల గురించి పెద్దగా తెలియని ప్రాంతాలకు వెళ్తే ఏ ఇబ్బందీ లేకుండా చిత్రీకరణ చేసుకోవచ్చని భావిస్తారు.

మనవాళ్లు ఇండియాలో ఎక్కువగా ఔట్ డోర్ షూటింగ్‌ కోసం వెళ్లే రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. ప్రస్తుతం ‘పుష్ప’ సినిమా చిత్రీకరణ కూడా ఆ రాష్ట్రంలోనే జరుగుతోంది. మరికొన్ని సినిమాలు కూడా తమిళనాడు, కేరళల్లో షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఐతే మనవాళ్లు తమిళనాడుకు వెళ్తుంటే.. తమిళనాడుకు చెందిన ఫిలిం మేకర్స్ తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెడుతుండటం విశేషమే.

రజినీకాంత్ సినిమా ‘అన్నాత్తె’తో పాటు అజిత్ మూవీ ‘వాలిమై’ చిత్రీకరణ హైదరాబాద్‌లోనే జరిగాయి. ‘అన్నాత్తె’ టీం మళ్లీ హైదరాబాద్‌కు రానుంది. విక్రమ్ సినిమా ‘కోబ్రా’ షూటింగ్ సైతం కొంత హైదరాబాద్‌లోనే జరిపారు. ఇక మణిరత్నం అయితే తన కలల సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ షూటింగ్‌ను చాలా వరకు తెలుగు రాష్ట్రాల్లోనే జరుపుతుండటం విశేషం. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన స్టూడియో అయిన రామోజీ ఫిలిం సిటీలో ‘పొన్నియన్ సెల్వన్’ కొన్ని నెలల పాటు చిత్రీకరణ జరుపుకుంది. కరోనా బ్రేక్ తర్వాత ఎన్నో షరతులు, పరిమితుల మధ్య షూటింగ్ జరపాల్సిన స్థితిలో ఫిలిం సిటీని మించిన వేదిక ఆయనకు కనిపించలేదు. అక్కడ షూట్ అయ్యాక మణిరత్నం తీసుకుని రాజమండ్రికి వెళ్లారు.

ముందు తన టీంతో వెళ్లి ఆ ప్రాంతంలో రెక్కీ చేసి వచ్చిన మణిరత్నం.. అక్కడి లొకేషన్లకు ఫిదా అయ్యారట. చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అక్కడి లొకేషన్లు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతాయనిపించి.. ఒక లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’ టీం అంతా రాజమండ్రిలోనే ఉంది. త్వరలోనే అటవీ నేపథ్యంలోనూ కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరపనున్నారట మణిరత్నం. ఈ చిత్రం విక్రమ్, ఐశ్వర్యారాయ్, కీర్తి సురేష్, అదితిరావు హైదరి, మోహన్ బాబు, అరవింద్ స్వామి లాంటి భారీ తారాగణంతో తెరకెక్కుతుండటం విశేషం.