పవన్ 7.. ఎన్టీఆర్ 7.. నేను 20-బన్నీ

‘అల వైకుంఠపురములో’ విడుదలకు ముందు నుంచి ఈ సినిమా పట్ల అల్లు అర్జున్ ఎంత ఎగ్జైటెట్‌గా ఉన్నాడో తెలిసిందే. ఇక గత ఏడాది ఈ సినిమా విడుదలై భారీ విజయాన్నందుకుని నాన్ బాహుబలి రికార్డును బద్దలు కొట్టాక బన్నీ ఆనందానికి అవధుల్లేవు. తనకు కూడా ఇండస్ట్రీ హిట్ రావడం పట్ల అతను అప్పుడు సక్సెస్ మీట్లోనే అమితానందం వ్యక్తం చేశాడు.

తాజాగా ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన రీయూనియన్ కార్యక్రమంలో బన్నీ తనకు ఇండస్ట్రీ హిట్ దక్కడం గురించి మాట్లాడాడు. ఈ సందర్భంగా వేరే హీరోలు ఇండస్ట్రీ హిట్లు అందుకున్న సందర్భాల గురించి బన్నీ మాట్లాడటం విశేషం.

‘‘పవన్ కళ్యాణ్ గారికి ఏడో సినిమా ‘ఖుషి’తో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ దక్కింది. ఆ సినిమా అప్పుడున్న రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. జూనియర్ ఎన్టీఆర్ గారికి కూడా ‘సింహాద్రి’ ఏడో సినిమానే అనుకుంటా. అది కూడా ఆల్ టైం హిట్ అయింది. ఇలా ప్రతి హీరోకూ ఏదో ఒక సమయంలో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ వస్తుంది. అదొక మైల్ స్టోన్ అవుతుంది.

ఐతే నాకు ఇలాంటి హిట్ ఎప్పుడొస్తుంది ఎప్పుడొస్తుంది అని ఎదురు చూస్తూ వచ్చా. కానీ నాకు 20వ సినిమాతో కానీ ఇండస్ట్రీ హిట్ రాలేదు. దీని కోసం నేను 17 ఏళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. అయినా సరే.. చాలా సంతోషం. ఐతే అభిమానులకు హామీ ఇస్తున్నా. ఇది నా ఫస్ట్ స్టెప్ మాత్రమే. తర్వాత ఏం జరుగుందన్నది మాటల్లో చెప్పను. యాక్షన్లో చూపిస్తా’’ అంటూ రాబోయే ‘పుష్ప’తోనూ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టబోతున్నట్లు సంకేతాలు ఇచ్చాడు బన్నీ. కరోనా కారణంగా 2020 చాలామందికి చేదు జ్ఞాపకంగా మిగిలిపోతే.. తనకు మాత్రం అద్భుతమైన ఏడాదిగా మిగిలిందని బన్నీ అన్నాడు.