సింగిల్ స్క్రీన్లలో పర్సంటేజీ విధానం అమలు విషయమై గత కొన్ని వారాలుగా టాలీవుడ్లో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య పెద్ద గొడవే నడుస్తున్న సంగతి తెలిసిందే. పోటాపోటీ ప్రెస్ మీట్లకు తోడు.. సినీ పెద్దలతో ఇరు వర్గాలు చర్చలు జరుపుతున్నాయి. తాజాగా ఎగ్జిబిటర్లు వెళ్లి మెగాస్టార్ చిరంజీవిని కలిస్తే.. రవిశంకర్, నాగవంశీ, సాహుగారపాటి, సతీష్ కిలారు లాంటి కొందరు పెద్ద నిర్మాతలు వెళ్లి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు.
ఐతే కొన్ని వారాల ముందు నిర్వహించిన ప్రెస్ మీట్లో ఉన్న నిర్మాతలే వెళ్లి ఇప్పుడు పవన్ను కలవడంతో ఇండస్ట్రీలో మిగతా ప్రొడ్యూసర్ల మాటేంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్లలో కానీ, సమావేశాల్లో కానీ చిన్న నిర్మాతలు అంతగా కనిపించడం లేదు. మరి థియేటర్ల గొడవతో వాళ్లకు సంబంధం లేదా.. వాళ్లకు సమస్యలేమీ లేవా అనే చర్చ జరుగుతోంది.
ఇదే విషయాన్ని యువ నిర్మాత ధీరజ్ మొగిలినేని అడిగితే.. అతను ఆసక్తికర రీతిలో స్పందించాడు. పెద్ద నిర్మాతల సమస్యలు ఒక రకం అయితే చిన్న నిర్మాతల సమస్యలు ఇంకో రకం అని ధీరజ్ అన్నాడు.
జూబ్లీహిల్స్లో 1000 గజాల్లో ఇల్లు కట్టాలనుకున్న వ్యక్తికి చైనా నుంచి ఫర్నిచర్ ఆలస్యం కావడం, కంటైనర్లో డ్యామేజీ జరగడం లాంటి సమస్యలు ఉంటాయని.. అదే సమయంలో మణికొండలో 250 గజాల స్థలం తీసుకుని ఇల్లు కట్టేవాడికి స్టీల్ సహా సామగ్రి ధరలు పెరగడం, లేబర్ దొరక్కపోవడం లాంటి ఇబ్బందులుంటాయని.. ఇద్దరూ కట్టేది ఇల్లే అయినా ఎవరి సమస్యలు వారివి అంటూ పెద్ద, చిన్న నిర్మాతల మధ్య ఉండే తేడాను వివరించాడు ధీరజ్.
ప్రస్తుత వివాదం అంతా పెద్ది అనేపెద్ద సినిమా చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఒక నెల రోజులు చిన్న నిర్మాతలమైన తాము సైలెంట్గా ఉండాలనుకుంటున్నట్లు ధీరజ్ తెలిపాడు. నిజానికి పవన్ కళ్యాణ్తో మీటింగ్కు తనతో పాటు చిన్న నిర్మాతలను పిలవలేదని చెప్పిన ధీరజ్.. పెద్ది గొడవ సద్దుమణిగాక చిన్న నిర్మాతలమైన తాము కలిసి కూర్చుని మాట్లాడుకుని, తమ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని, పవన్ కళ్యాణ్ను కూడా కలుస్తామని ధీరజ్ తెలిపాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates