హవ్వ… ఆరో తరగతిలో పాటల కంపోజింగా?

స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్‌లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ రంగంలోనే ఇలాంటి బాల మేధావులు కనిపిస్తుంటారు. జి.వి.ప్రకాష్ కుమార్, అనిరుధ్ రవిచందర్.. కేవలం 18 ఏళ్ల వయసులోనే సంగీత దర్శకులుగా మారి ఎంతటి సంచలనం రేపారో తెలిసిందే. వీరి బాటలోనే సాయి అభ్యంకర్ అనే కుర్రాడు కూడా అంతే చిన్న వయసులో సంగీత దర్శకుడు అయిపోయాడు. 

గత ఏడాది ‘డ్యూడ్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అతను.. ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీల కలయికలో తెరకెక్కుతున్న ‘రాకా’ లాంటి మెగా మూవీకి మ్యూజిక్ చేస్తున్నాడు. ప్రస్తుతం తన వయసు 21 ఏళ్లే. సీనియర్ గాయకులు టిప్పు, హరిణిల కుమారుడైన ఈ కుర్రాడు.. చిన్నతనంలోనే సంగీతంలోకి అడుగు పెట్టేశాడు. ఆరో తరగతి చదువుతున్నపుడే అతను పాటల కంపోజింగ్ చేశాడట. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో అతను వెల్లడించాడు.

ఆరో తరగతి అంటే అప్పటికి 11 ఏళ్ల వయసుంటుంది. సంగీతం నేర్చుకున్నా సరే.. వేరే వాళ్ల పాటలు పాడడమో.. మ్యూజిక్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ప్లే చేయడేమో చేస్తారు తప్పితే సొంతంగా పాట కంపోజ్ చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు. కానీ అభ్యంకర్ అప్పట్లోనే పాటల కంపోజింగ్ మొదలుపెట్టేశాడట. ఇలా పెరిగి పెద్దయ్యే క్రమంలో వెయ్యి పాటల దాకా కంపోజ్ చేసి పక్కన పెట్టుకున్నట్లు అభ్యంకర్ వెల్లడించాడు. కానీ ఈ ట్యూన్స్ వేటినీ తన సినిమాల్లో ఉపయోగించట్లేదని.. ఆయా సినిమాల కథలను అనుసరించి పాటలు చేస్తున్నానని.. తన దగ్గరున్న వెయ్యి పాటలను 60 ఏళ్ల వయసు దాటాక ఉపయోగిస్తానని అతను చెప్పాడు. 

‘డ్యూడ్’లో ‘ఊరుం బ్లడ్’ పాటకు తొలి రెండు రోజులు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందని.. కానీ తర్వాత జనాలకు అది ఎక్కుతుందని ముందే ఊహించానని.. అదే జరిగిందని అతనన్నాడు. ‘రాకా’ సినిమా కాన్సెప్ట్ వింటే క్రేజీగా అనిపించిందని.. ఎంతో ఇన్‌స్పైర్ అయి ట్యూన్స్ కంపోజ్ చేశానని.. ఈ పాటల కోసం ఇంటర్నేషనల్ సింగర్స్‌‌ను తీసుకురావాలని చూస్తున్నామని.. తద్వారా తన సినిమా పాటలు అంతర్జాతీయ స్థాయికి వెళ్తాయని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు.