మధుర గాయని ఇక లేరు

భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరిన ఆశా.. ఆదివారం తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 92 సంవత్సరాలు. ఆశా మరణించినట్లు మధ్యాహ్న సమయంలో ఆమె తనయుడు ఆనంద్ భోస్లే ధ్రువీకరించారు. ఆమె అంత్యక్రియలు సోమవారం శివాజీ పార్క్‌లో నిర్వహించనున్నారు.

అనారోగ్యం వల్ల కొన్నేళ్లుగా ఆశా ఇంటికే పరిమితం అయ్యారు. తాజాగా ఆమెకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తింది. దీంతో ఆసుపత్రిలో చేర్చారు. కానీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తుది శ్వాస విడిచారు. ఆశా 1933లో బ్రిటిష్ ఇండియా పరిధిలోని సంగ్లి‌ రాష్ట్రంలో జన్మించారు. తర్వాత అది మహారాష్ట్రలో కలిసింది.

పదేళ్ల వయసులోనే గాయనిగా మారిన ఆశా.. ఎనిమిది దశాబ్ద సుదీర్ఘ కెరీర్లో ఏకంగా 12 వేల పాటలు పాడారు. భారతీయ భాషలే కాక ఫారిన్ లాంగ్వేజెస్‌లోనూ ఆమె పాటలు పాడడం విశేషం. మొత్తంగా 20 భాషల్లో పాటలు పాడిన అరుదైన గాయని ఆశా. ఆమె తెలుగులోనూ కొన్ని పాటలు ఆలపించారు. చివరగా ఆమె ‘చందమామ’ సినిమాలో పాడిన ‘నాలో ఊహలకు’ పాట పెద్ద హిట్టయింది.

భారతీయ సినీ చరిత్రలో లతా మంగేష్కర్ అత్యుత్తమ గాయనిగా నిలిస్తే.. ఆమె తర్వాతి స్థానంలో ఆశాదే. లతాకు ఆశా సోదరే కావడం విశేషం. ఆశాది కూడా మంగేష్కర్ కుటుంబమే. ఐతే 16 ఏళ్ల వయసులోనే ఆమె కుటుంబాన్ని విడిచి.. గణపత్‌రావు భోస్లేతో వెళ్లిపోయారు. తర్వాత కుటుంబ అంగీకారంతో ఆయన్ని పెళ్లి చేసుకున్నారు.

అప్పటిదాక ఆశా మంగేష్కర్‌గా ఉన్న ఆమె.. పెళ్లి తర్వాత ఆశా భోస్లే అయ్యారు. రెండు జాతీయ అవార్డులతో పాటు లెక్కకు మిక్కిలి పురస్కారాలను పొందారు ఆశా. 2008లో ఆమె భారత రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్‌‌కు ఎంపికయ్యారు. 2000లో అత్యున్నత సినీ పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.