ఆదివారం రోజు దురంధర్ ది రివెంజ్ తర్వాత మల్టీప్లెక్సుల ప్రీమియం స్క్రీన్లలో టికెట్లు దొరకని సినిమా ఏదంటే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఒకటే. ముఖ్యంగా ప్రసాద్స్ పీసీఎక్స్, అల్లు సినిమాస్, ఏఏఏ, ఏఎంబి లాంటి చోట్ల ఏకంగా రికమండేషన్లు వాడితే తప్ప చూడలేని పరిస్థితి నెలకొంది. మూవీ చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అలాని తెలుగు రాష్ట్రాల థియేటర్లలో అన్నిచోట్లా ఇదే రెస్పాన్స్ ఉందనుకునేరు. కేవలం నగరాలకు మాత్రమే ఈ మేనియా పరిమితమయ్యింది.
అంతగా ప్రాజెక్ట్ హెయిల్ మేరీలో ఏముందో చూద్దాం. ఇదో సైన్స్ ఫిక్షన్ నవల ఆధారంగా తీసిన సినిమా. రైలాండ్ గ్రేస్ హఠాత్తుగా నిద్ర లేస్తే తన సాటి వ్యోమగాములు చనిపోయి అంతరిక్ష నౌకలో ఒక్కడే మిగులుతాడు. ఆస్ట్రోఫేజ్ అనే వింత జీవి కారణంగా సూర్యుడి వేడి తగ్గిపోయి ప్రపంచం అంతరించే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రపంచ దేశాలు దీన్ని అరికట్టడానికి గ్రేస్ బృందాన్ని అంతరిక్షంలో పంపిస్తాయి. రాకీ అనే మరో గ్రహంతో కలిసి అతనేం చేశాడనేది అసలు స్టోరీ.
సైన్స్ ఫిక్షన్ అయినప్పటికీ ఇందులో అన్ని అంశాలు ఉంటాయి. ప్రతిదీ శాస్త్రీయంగా వివరించే ప్రయత్నం చేశారు. ఏలియన్ గా చూపించిన రాకీ, గ్రెస్ మధ్య ఏర్పరిచిన బాండింగ్, అతని ఫ్లాష్ బ్యాక్ వగైరాలు ఆకట్టుకుంటాయి. అయితే రెండు గంటల నలభై నిమిషాల నిడివిలో సైన్స్ పాఠాలు, థియరీలు బోర్ కొట్టిస్తాయి. వీటి మీద ఆసక్తి లేని వాళ్లకు ఆ ఎపిసోడ్లన్నీ ఎప్పుడు అయిపోతాయా అనిపిస్తుంది. ఇది తట్టుకుంటేనే బెస్ట్ ఎక్స్ పీరియన్స్ అనిపిస్తుంది.
కామన్ ఆడియన్స్ కి మాత్రం ప్రాజెక్ట్ హెయిల్ మేరీ ఓ మాములు చిత్రంగా అనిపిస్తుంది. ట్విస్ట్ ఏంటంటే ఇంటర్ స్టెల్లార్ స్థాయిలో ఇదో కల్ట్ గా నిలిచిపోతుందని ఆ జానర్ మూవీ లవర్స్ బల్లగుద్ది చెబుతున్నారు. అయితే గొప్ప అనుభూతి దక్కాలంటే మాత్రం మాములు థియేటర్ లో చూడకూడదు. అక్కడ మాత్రం బోర్ కొట్టే ప్రమాదముంది. దర్శక ద్వయం ఫిల్ లార్డ్ మరియు క్రిస్టోఫర్ మిల్లర్ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలంటే మాత్రం పొరపాటున కూడా ఆషామాషీ స్క్రీన్ కు వెళ్ళకూడదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates